అక్షరటుడే, వెబ్డెస్క్ : Nimisha Priya | యెమెన్ (Yemen)లో భారత్కు చెందిన నర్సు నిమిష ప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు అవాస్తవమని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. యెమెన్ దేశస్తుడి హత్య కేసులో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష పడింది. జులై 16నే ఆమెకు ఉరిశిక్ష విధించాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్చలతో ఉరిశిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది.
నిమిష ప్రియ మరణ శిక్ష రద్దు చేశారంటూ సోమవారం రాత్రి భారత గ్రాండ్ ముఫ్తీ, కాంతపురం AP అబుబక్కర్ ముస్లయ్యర్ కార్యాలయం ప్రకటించింది. అయితే విదేశాంగ శాఖ తాజాగా దీనిపై స్పందించింది. యెమెన్ ప్రభుత్వం నుంచి తమకు ఉరిశిక్ష రద్దుకు సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదని చెప్పింది. ఆ వార్తలు అన్ని అవాస్తవం అని పేర్కొంది.
Nimisha Priya | మళ్లీ మొదటికి..
యెమెన్ దేశస్తుడి హత్య కేసులో నిమిష ప్రియకు ఉరి శిక్ష పడింది. అక్కడ వ్యాపార భాగస్వామిగా ఉన్న తలాల్ అబ్దో మహదీని నిమిష హత్య చేసింది. అనంతరం పారిపోతుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో 2024లో అక్కడి కోర్టు మరణశిక్ష విధించబడింది. ఈ నెల 16న ఉరి తీసేందుకు నిర్ణయించగా, భారత దౌత్యంతో ఆగిపోయింది. బ్లడ్మనీ (Blood Money) కోసం సమయం కావాలని కోరడంతో యెమెన్ ప్రభుత్వం ఉరిశిక్షను వాయిదా వేసింది. ఈ క్రమంలోనే మరణ శిక్ష రద్దయినట్లు వార్తలు వచ్చాయి. అయితే విదేశాంగ శాఖ మాత్రం మరణ శిక్ష రద్దు కాలేదని తెలిపింది. కాగా మృతుడి కుటుంబ సభ్యులు బ్లడ్మనీకి అంగీకరించమని తేల్చి చెప్పారు. దీంతో ఈ కేసు ఎటువైపు వెళ్తుందోననే ఉత్కంఠ నెలకొంది.