అక్షరటుడే, హైదరాబాద్: Singireddy Niranjan Reddy | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కవితపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు.
నేను నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోలేదు.. నువ్వే లిక్కర్ రాణి అని పిలిపించుకున్నావు.. అని ఘాటుగా మాట్లాడారు. నువ్వు ఎత్తకపోతే బోనమే లేనట్టు.. నువ్వు ఆడక పోతే బతుకమ్మే లేనట్టు దురహంకారంతో ప్రవర్తిస్తున్నావు.. అని వ్యాఖ్యానించారు.
ఓట్ల కోసం తండాల్లో తిరుగుతుంటే.. మీ కేసీఆర్ బిడ్డ సారా దందా చేస్తే ఏం కాదు.. కానీ, మేము సారా కాస్తే అరెస్టు చేయిస్తారా.. అని నన్ను లంబాడా మహిళలు నిలదీశారని పేర్కొన్నారు.
కేసీఆర్ కూతురు కాబట్టే నీకు ఇంకా గౌరవం ఇస్తూ మాట్లాడుతున్నాం.. ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవడం లేదు.. అని అన్నారు. మేము కేసీఆర్కు మంచి పేరు తెస్తుంటే.. నువ్వు ఆయనను మానసికంగా వేధిస్తున్నావు.. అని విమర్శించారు.
Singireddy Niranjan Reddy | కేసీఆర్ ఓటమికి కారణం ఆమెనే..
ఎవరినో సంతోషపెట్టడానికి కవిత నాపై ఆరోపణలు చేస్తోంది.. నీ అహంకారం, నీ చర్యలు కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణమయ్యాయి.. అని ఆరోపణలు చేశారు.
నాకు ఒక్క వ్యవసాయ క్షేత్రం మాత్రమే ఉంది.. నీకు గండిపేటలో విలాసవంతమైన ఫామ్ హౌస్ లేదా? అన్ని పైసలు నీకు ఎక్కడివి?.. అని ప్రశ్నించారు.
తండ్రి వయసు ఉన్న ఎమ్మెల్యేలను ఇంటికి పిలిపించుకుని, జాగృతిలో చేరాలని అడిగి, ఒప్పుకోని నా లాంటి వాళ్ల మీద ఆరోపణలు వేస్తున్నావు.. అని కవితపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు.
