అక్షరటుడే, వెబ్డెస్క్: Madnoor Police | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో (joint Nizamabad district) ఇసుక దందా జోరుగా సాగుతోంది. కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారు.
పోలీసులు, అధికారులు దాడులు చేపడుతుండటంతో కొత్త పద్ధతుల్లో ఇసుక రవాణా చేస్తున్నారు. అర్ధరాత్రి పూట గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు ఇసుక తరలిస్తున్నారు. కొందరైతే మహారాష్ట్రకు (Maharashtra) సైతం ఇసుక తరలించి రూ.లక్షలు సంపాదిస్తున్నారు. అయితే హైటెక్ లెవల్లో ఇసుక రవాణా చేస్తున్న ఓ ముఠాను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
ఇసుక అక్రమ రవాణా (illegal sand smuggling) చేస్తున్న కొందరు.. పోలీసులు, అధికారులు అడ్డుకుంటారనే భయంతో కార్లతో పైలెటింగ్ చేపడుతున్నారు. ముందు ఒక కారు వెళ్తుంది. అంతా క్లియర్ ఉందని అనుకుంటే టిప్పర్ తీసుకు రావాలని సమాచారం అందిస్తారు. వెనకాల టిప్పర్ వెళ్తుంది. ఇలా ఇసుక తరలిస్తున్న ఆరుగురిని మద్నూర్ పోలీసులు (Madnur police) అరెస్ట్ చేశారు. ఇసుక రవాణా చేస్తున్న రెండు టిప్పర్లు, 2 పైలెటింగ్ కార్లు స్వాధీనం చేసుకున్నారు.
Madnoor Police | పక్కా సమాచారంతో..
కొత్త పద్ధతిలో పైలెట్ కార్ల సహాయంతో పోలీస్ చెక్పోస్టులను దాటించి మహారాష్ట్రకు టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారు. అయితే పక్కా సమాచారం మేరకు మద్నూర్ పోలీసులు నిఘా ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. రెండు టిప్పర్లు, రెండు పైలట్ కార్లను ఆపి తనిఖీ చేశారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ గ్రామం (Pothangal village) నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు టిప్పర్ డ్రైవర్లతో పాటు కార్లలో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
