అక్షరటుడే, ఇందూరు: DCC President | కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో నేడు (జులై 17న) ఆయన తలపెట్టిన ‘కనువిప్పు’ కార్యక్రమం నేపథ్యంలో పోలీసు అధికారులు ఈ చర్యకు దిగారు.
డీసీసీ అధ్యక్షుడు, కార్పొరేషన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కనువిప్పు కార్యక్రమం గురించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గల్ఫ్ బాధిత కుటుంబాల పట్ల మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై ప్రశాంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో వేల్పూర్(Velpur)లో గురువారం కనువిప్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో గల్ఫ్ బాధిత కుటుంబాలను పట్టించుకోని ప్రశాంత్రెడ్డి, నేడు వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లాలనే దురాలోచనతో తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
DCC President | ప్రభుత్వ పథకాలపై చర్చకు సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వం (State Government) అమలు చేస్తున్న పథకాలపై చర్చించడానికి డీసీసీ అధ్యక్షుడిగా తనతో పాటు బాల్కొండ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి (Balkonda Incharge Sunil Reddy), రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి (Chairmen Anvesh Reddy) కనువిప్పు కార్యక్రమానికి వస్తున్నామన్నారు. ప్రశాంత్రెడ్డికి నీతి ఉంటే వేల్పూరులో నిర్వహించే కార్యక్రమానికి రావాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ప్రకటించిన విధంగా కనువిప్పు కార్యక్రమానికి బయలుదేరేందుకు సిద్ధమైన మానాల మోహన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
DCC President | పోలీసుల ఆంక్షలు..
వేల్పూర్ (Velpur) మండలం చుట్టు పక్కల ప్రాంతాల్లో గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు బీఎన్ఎస్ 163 (BNS 163) చట్టం అమలులో ఉంటుందని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) ఇప్పటికే ప్రకటించారు. వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా ఈ సెక్షన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
DCC President | బాల్కొండ నియోజకవర్గంలో..
బాల్కొండ నియోజకవర్గంలోనూ పోలీసులు రెండు పార్టీల నేతలను అడ్డుకున్నారు. నాయకులను ఎక్కడికక్కడ కట్టడి చేశారు. పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్టు చేశారు.