అక్షరటుడే, వెబ్డెస్క్ : IT Raids | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. నగరంలోని పలు ప్రముఖ హోటళ్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో మంగళవారం అధికారులు తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే బుధవారం సైతం సోదాలు నిర్వహిస్తున్నారు.
నగరంలోని పిస్తా హౌజ్ (Pistachio House), షా గౌస్, మైహిఫిల్ హోటళ్ల (Mehfil Hotels) నిర్వాహకుల ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ హోటళ్లకు చాలా బ్రాంచ్లు ఉన్నాయి. ప్రతి ఏటా వందల కోట్ల వ్యాపారాలు చేస్తున్నాయి. అయితే ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. రాజేంద్రనగర్లోని (Rajendranagar) పిస్తా హౌస్ ఓనర్లు మహమ్మద్ మజీద్, మహమ్మద్ అబ్దుల్ మోషీ ఇళ్లలో రెండు రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే హోటల్ వర్కర్లకు సంబంధించిన నివాసాల్లో సైతం పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్లు సీజ్ చేశారు.
IT Raids | వ్యాపారుల్లో కలవరం
నగరంలో ఇటీవల వరుసగా ఐటీ దాడులు (IT Raids) జరుగుతుండడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో బంగారు వర్తకులకు సంబంధిన దుకాణాలు, ఇళ్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు. తాజాగా హోటళ్లపై రైడ్ సాగుతోంది. మంగళవారం ఏకకాలంలో 30 బృందాలు సోదాలు చేపట్టాయి. బుధవారం సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే చాలా మంది వ్యాపారులు పన్నులు సక్రమంగా చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. తాజా ఐటీ దాడులతో వారు కలవరం చెందుతున్నారు. తమపై ఎక్కడ రైడ్ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
