అక్షరటుడే, వెబ్డెస్క్: IAS Officers | ఓ టీవీ ఛానెల్లో ప్రసారం అయిన కథనంపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఐఏఎస్ అధికారి (Woman IAS Officer)పై చేసిన ఆరోపణలను ఆయా సంఘాలు ఖండించాయి.
రాష్ట్రంలోని ఓ మంత్రితో మహిళా ఐఏఎస్ అధికారి ప్రేమ వ్యవహారం నడిపించారని ఇటీవల ఓ ఛానెల్లో ప్రత్యేక కథనం ప్రచురించారు. దీంతో సదరు మంత్రి కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆ అధికారిని బదిలీ చేశారని కథనంలో పేర్కొన్నారు. అయితే ఈ కథనంపై ఐఏఎస్ అధికారుల సంఘం శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరాధర ఆరోపణలు చేసిన సదరు టీవీ ఛానెల్ (TV Channel) క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
IAS Officers | కించపరిచే ప్రయత్నం
ఈ కార్యక్రమంలో మహిళా IAS అధికారులపై తప్పుడు, దురుద్దేశపూరితమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారని అసోసియేషన్ ఖండించింది. ఈ వాదనలు పూర్తిగా కల్పితమైనవి, పరువు నష్టం కలిగించేవని పేర్కొంది. జర్నలిజం (Journalism) ప్రాథమిక నిబంధనలకు కట్టుబడి ఉండకుండా నిర్లక్ష్యంగా ప్రసారం చేయడం సరికాదని తెలిపింది. ఈ కంటెంట్ ముఖ్యంగా మహిళా అధికారులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి కథనాలు పాలనపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంది. సదరు కంటెంట్ను తొలగించి యాజమాన్యం క్షమాపణ చెప్పాలని అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
IAS Officers | ఐపీఎస్ అసోసియేషన్ సంఘీభావం
తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం (Telangana IPS Officers Association) ఐఏఎస్ అధికారుల సంఘానికి సంఘీభావం తెలిపింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. కొన్ని మీడియా వేదికలు ప్రసారం చేసిన బాధ్యతారహితమైన, దురుద్దేశపూరితమైన, పరువు నష్టం కలిగించే ప్రసారాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. ఈ సంఘటనను జర్నలిజం ముసుగులో వ్యక్తిత్వ హనానికి పాల్పడటంగా పేర్కొంది. సంబంధిత మీడియా సంస్థలు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
