అక్షరటుడే, వెబ్డెస్క్ : GV Prakash | ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్, గాయని సైంధవి వైవాహిక బంధం అధికారికంగా ముగిసింది. కొంతకాలంగా వీరి మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో, పరస్పర అంగీకారంతో వారు విడాకులు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై చెన్నై ఫ్యామిలీ కోర్టు(Chennai Family Court) మంగళవారం తుది తీర్పును వెలువరించింది.
ఈ జంట ఈ ఏడాది మార్చి 24న చెన్నైలోని మొదటి అదనపు ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల(Divorce) కోసం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి సెల్వ సుందరి, చట్ట ప్రకారం తప్పనిసరిగా పాటించాల్సిన ఆరు నెలల గడువును వారికి ఇచ్చారు.
GV Prakash | విడిపోయారు..
ఆ గడువు ముగిసిన నేపథ్యంలో, సెప్టెంబర్ 25న కేసు మళ్లీ విచారణకు రాగా, జీవీ ప్రకాశ్(GV Prakash) మరియు సైంధవి ఇద్దరూ కోర్టుకు హాజరై విడిపోవాలన్న తమ నిర్ణయాన్ని పునరుద్ఘాటించారు.విచారణ సందర్భంగా న్యాయమూర్తి వారి కుమార్తె సంరక్షణ గురించి ప్రశ్నించగా, చిన్నారి తల్లి సైంధవి(Saindhavi) వద్దనే ఉండటం పై జీవీ ప్రకాశ్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఈ అంశంలో ఇరువర్గాల అంగీకారాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, విడాకులను మంజూరు చేస్తూ తుది తీర్పు వెలువరించింది.
జీవీ ప్రకాశ్ – సైంధవి జంట 2013లో పెళ్లి చేసుకోగా, 2020లో వీరికి కుమార్తె జన్మించింది. ప్రస్తుతం ఆ బాలిక తల్లి సైంధవి సంరక్షణలోనే పెరుగనుంది.ఈ ఘటనతో తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ జంటగా గుర్తింపు పొందిన జీవీ ప్రకాశ్, సైంధవి వైవాహిక జీవితం అధికారికంగా ముగిసినట్టైంది. వీరిద్దరి మధ్య ముందు స్నేహం ఏర్పడగా, ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఆ తర్వాత పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇలా విడిపోవడం అభిమానులకి నిరాశని కలిగిస్తుంది.