అక్షరటుడే, వెబ్డెస్క్: DA Hike | సంక్రాంతి పండుగ (Sankranthi festival) వేళ ఉద్యోగులు, పెన్షనర్లకు (pensioners) రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరువు భత్యం (డీఏ) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉద్యోగులకు మరో డీఏ ఇస్తామని సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్రెడ్డి (Chief Minister Revanth Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సాయంత్రం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్కుమార్ సుల్తానీయా ఉత్తర్వులు జాఈర చేశారు. ప్రస్తుతం డీఏ 30.03 శాతం ఉండగా.. 33.67 శాతానికి పెంచింది. ఈ పెంపు 2023 జులై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది. 2026 జనవరిలో జీతంలో పెంచిన డీఏను చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
జులై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు పెంచిన డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో (GPF account) వేస్తామని ప్రకటించింది. రిటైర్డ్ అయ్యే వారికి 30 విడతల్లో చెల్లిస్తామని తెలిపింది. డీఏ పెంపుతో ప్రభుత్వంపై రూ.227 కోట్ల భారం పడనుంది. కాగా ప్రభుత్వం నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పెండింగ్ డీఏలను సైతం విడుదల చేయాలని కోరుతున్నారు.
