అక్షరటుడే, వెబ్డెస్క్ : GHMC | జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో (GHMC council meeting) సభ్యుల ఆందోళనతో రచ్చ రచ్చ నెలకొంది. మేయర్ విజయలక్ష్మి (Mayor Vijayalakshmi) అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
సమావేశం ప్రారంభం సందర్భంగా వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాలు ఆలపించారు. ఆ సమయంలో కొందరు మజ్లిస్ కార్పొరేటర్లు కుర్చీలో అలాగే కూర్చొని ఉన్నారు. దీనిపై బీజేపీ కార్పొరేటర్లు (BJP corporators) అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఉండాలంటే వందేమాతరం పడాల్సిందేనని నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా మజ్లిస్ కార్పొరేటర్లు సైతం ఆందోళనకు దిగారు. దీంతో సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
GHMC | టేబుళ్ల మీదకు ఎక్కి..
మజ్లిస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెండు పార్టీల సభ్యులు టేబుళ్ల మీదకు ఎక్కి హంగామా చేశారు. దీంతో మార్షల్స్ వచ్చి వారిని సభ నుంచి బయటకు పంపేందుకు యత్నించారు. సభ జరిగేలా సహకరించాలని మేయర్తో పాటు కాంగ్రెస్ సభ్యులు కోరారు.
GHMC | బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళన
సభలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు (BRS corporators) సైతం ఆందోళన చేపట్టారు. సమావేశం ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులతో హాల్లోకి వచ్చారు. దీంతో మార్షల్స్ వచ్చి వారి వద్ద ఉన్న ప్లకార్డులను లాక్కెళ్లారు. దీనిపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాల్లో ఆందోళన చేపట్టారు. సభ ప్రారంభం కాకముందే మార్షల్స్ హాల్లోకి ఎలా వచ్చారని ప్రశ్నించారు.
అంతకుముందు బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసన తెలిపారు. వారు సమావేశానికి దున్నపోతులతో నిరసనగా వచ్చారు. సీఎం, జీహెచ్ఎంసీ మేయర్, అధికారులకి వినతిపత్రం ఇవ్వడం కన్నా.. దున్నపోతుకి ఇవ్వడం మేలంటూ నినాదాలు చేశారు. కాగా జీహెచ్ఎంసీ పాలకవర్గ పదవి కాలం ఫిబ్రవరిలో ముగియనుంది. ఈ కౌన్సిల్ సమావేశం చివరిది. ఆఖరు మీటింగ్లో కూడా సభ్యులు రచ్చ రచ్చ చేయడం గమనార్హం.
