అక్షరటుడే, ఇందూరు: Mla Dhanpal | రెండున్నరేళ్లలో నిజామాబాద్ నగరానికి వచ్చిన సీడీపీ నిధులు శూన్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైందన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీనన్నారు.
Mla Dhanpal | అసలైన సెక్యూలర్ పార్టీ బీజేపీ..
దేశంలో అసలైన సెక్యులర్ పార్టీ తమదేనని ఎమ్మెల్యే ధన్పాల్ పునరుద్ఘాటించారు. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థికి రూ.10 కోట్లు కేటాయించారని ఇప్పటివరకు ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో తెలపాలన్నారు. అర్బన్ను రూ.500 కోట్లతో అభివృద్ధి చేశామని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (MLC Mahesh Kumar Goud) చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేంద్ర పథకాలు కాపీ కొడుతున్నారన్నారు. దేశంలో సీడీపీ ఫండ్ ఇవ్వని రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమేనని విమర్శించారు.
Mla Dhanpal | అనేకసార్లు సీఎంకు లేఖలు..
అర్బన్లో ప్రధాన సమస్యలపై అనేకసార్లు సీఎం రేవంత్ రెడ్డికి లేఖలు ఇచ్చానని ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదని ఎమ్మెల్యే అన్నారు. నిజామాబాద్ బస్టాండ్, ప్రభుత్వాస్పత్రి, కళాభారతి గురించి పట్టించుకోవడం లేదన్నారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇలా పోటీ చేస్తుందన్నారు. ప్రజలే దీనికి సరైన సమాధానం ఇస్తారని తెలిపారు. నిజామాబాద్ కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని కచ్చితంగా నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామన్నారు.
Mla Dhanpal | భారతీయ సంస్కృతిని కాపాడేది బీజేపీ..
భారత సంస్కృతిని కాపాడేది బీజేపీ పార్టీ మాత్రమేనని ఎమ్మెల్యే తెలిపారు. హిందూ దేవతలపై అనవసర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, పోతన్కర్ లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి జ్యోతి, నాయకులు రాజు, ప్రమోద్, ప్రభాకర్, వేణు, కిషోర్, బట్టు రాఘవేందర్, మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
