అక్షరటుడే, హైదరాబాద్: BC reservation| తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీల ప్రాతినిధ్యం 50 శాతం దాటాలని ఆదేశించారు. కాగా, బీసీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం నిర్దేశించినట్లు తెలుస్తోంది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి 50 శాతం మించకుండా రాజ్యాంగపరమైన రిజర్వేషన్ల పరిమితులను పాటిస్తూనే.. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచాలని ఆదేశించారు. ఈమేరకు జనరల్ స్థానాల్లోనూ బీసీ అభ్యర్థులను పోటీలో నిలపాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
BC reservation | ఎమ్మెల్యేలకు బాధ్యతలు..
బీసీలకు కాంగ్రెస్ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ మీటింగ్లో ఇప్పటికే నిర్ణయించారు. ఆ కోటాను తాజాగా మరింత పెంచే పనిలో నిమగ్నమయ్యారు. జనరల్ కేటగిరీ సర్పంచి, వార్డు సభ్యుల స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బీసీ అభ్యర్థులను నిలిపే బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించారు.
అభ్యర్థుల ఎంపికలో ఏకపక్ష, వివక్ష నిర్ణయాలు ఉండొద్దని స్పష్టం చేశారు. సామాజిక సమీకరణాలు, స్థానిక పరిస్థితులు, గెలుపు అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా, కచ్చితత్వంతో ఉండేలా చూడాలని సూచించారు.
