అక్షరటుడే, ఇందూరు: Local Body Elections | జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కొముదిని సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ (video conference) ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 545 గ్రామపంచాయతీలకు గాను తొలి విడతలో 281 జీపీలకు, రెండో విడతలో 264 జీపీ లకు ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. మొత్తం 5,022 గ్రామపంచాయతీ (gram panchayats) వార్డు స్థానాలకు గాను, మొదటి దఫాలో 2,510 వార్డులకు, రెండో విడతలో 2,512 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. అలాగే 31 జడ్పీటీసీ, 307 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సమక్షంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నోడల్ అధికార్లతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (State Election Commission) మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి తప్పులకు తావు లేకుండా సమన్వయంతో పని చేస్తూ సాఫీగా నిర్వహించాలన్నారు.
ఏవైనా సందేహాలు ఉంటే పైస్థాయి అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. వీడియోకాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యం మాల్వియా, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, డీఆర్డీవో సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.