అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Case | అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) చేపడుతున్నా.. లంచాలు తీసుకోవడం మాత్రం మానడం లేదు. పైసలు ఇస్తేనే పనులు చేపడుతున్నారు. అయితే ఏసీబీ అధికారులు ఇటీవల దూకుడు పెంచారు. అవినీతి అధికారుల పని పడుతున్నారు. తాజాగా ఎన్పీడీసీఎల్ ఏఈని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
వనపర్తి (Wanaparthy) జిల్లా గోపాల్పేటలో రైతు నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ ఏఈ హర్షవర్ధన్ రెడ్డి ఏసీబీకి చిక్కాడు. వనపర్తి సర్కిల్, డివిజన్లోని గోపాల్పేట సెక్షన్ సహాయక ఇంజనీరు(ఆపరేషన్స్)గా నర్వ హర్షవర్ధన్ రెడ్డి పని చేస్తున్నాడు. ఓ రైతు పొలంలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడానికి ఏఈ రూ.40 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో రైతు బంధువు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంగళవారం రూ.20 వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు ఏఈని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.
ACB Case | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
