అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు ఏ మాత్రం మారడం లేదు. ప్రతి పనికి లంచం తీసుకుంటున్నారు. డబ్బులు ఇస్తేనే పనులు చేపడుతున్నారు. అంత్యక్రియల ఖర్చు కోసం వచ్చే డబ్బులు ఇవ్వడానికి సైతం ఓ అధికారి లంచం అడిగాడు.
రాష్ట్రంలో ఏసీబీ (ACB) అధికారులు దాడులు చేస్తున్నా.. లంచాలకు మరిగిన అధికారులు ఏ మాత్రం బయపడటం లేదు. లంచం తీసుకోవడం కూడా కొందరు తమ హక్కుగా భావిస్తున్నారు. తాజాగా ఖమ్మం (Khammam) జిల్లా సహాయ కార్మిక అధికారి కర్నె చందర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా నమోదు చేసుకున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రభుత్వం నుంచి అతడి కుటుంబానికి అంత్యక్రియల ఖర్చు, ఇతర ఖర్చుల కోసం రూ.1.30 లక్షలు వస్తాయి. ఆ డబ్బుల కోసం మృతుడి కుమారుడు దరఖాస్తు చేసుకున్నాడు.
ఆ దరఖాస్తును ఉన్నతాధికారులకు పంపి, రూ.1.30 లక్షలు మంజూరు చేయడానికి జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారి చందర్ రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమచారం ఇచ్చాడు. ఈ మేరకు సోమవారం లంచం తీసుకుంటుండగా సహాయ కార్మిక శాఖ అధికారి (Assistant Labour Officer) చందర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కార్యాలయంలో సోదాలు చేపట్టారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా అంత్యక్రియల డబ్బుల కోసం కూడా లంచం అడిగిన సందరు అధికారిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకంటే నీచమైన వారు ఉంటారా.. అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. లంచాలు తీసుకునే వారిని ఉద్యోగాల్లో నుంచి పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ACB Raid | లంచం ఇవ్వొద్దు
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
