అక్షరటుడే, వెబ్డెస్క్: Harish Rao | తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
సినిమా టికెట్ ధరల పెంపుతో తనకు సంబంధం లేదని మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy) పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై హరీశ్రావు స్పందించారు. మంత్రికి తెలియకుండా జీవోలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది.. జీవో ఇచ్చేది ఇంకొకరని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం నడుపుతున్నారా.. లేక లేక సర్కస్ కంపెనీనా అని ఎద్దేవా చేశారు. టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమన్నారు.
Harish Rao | చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. తాను ఈ సీట్లో ఉన్నంత కాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదని, బెనిఫిట్ షోలు ఉండవని చెప్పారని హరీశ్ రావు అన్నారు. మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చాయని ప్రశ్నించారు. ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచుతూ జీవోలు ఇచ్చారన్నారు. ఇవాళో రేపో.. మరో సినిమాకు కూడా జీవో ఇవ్వడానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు.
Harish Rao | మంత్రిని చూస్తే జాలేస్తోంది
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డిని చూస్తే జాలేస్తోందని మాజీ మంత్రి అన్నారు. హోం శాఖ జీవో ఇస్తుందని, సినిమా మంత్రి ఏమో తనకు సంబంధం లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. ఐటీ మంత్రిని తానే, సివిల్ ఏవియేషన్ మంత్రిని తానే అని ఈ మధ్య చెప్పుకున్న వెంకట్రెడ్డి ఇప్పుడు ఉన్న శాఖతో తనకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టా..లేనట్టా అన్నారు.
Harish Rao | పేరు మర్చిపోయినందుకు జైలుకు
సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా అని హరీశ్రావు ప్రశ్నించారు. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరని, ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచమర్యాదలతో పర్మిషన్ ఎలా ఇస్తారన్నారు. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష కట్టారని ఆరోపించారు. సీఎం పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపించారని వ్యాఖ్యానించారు. పాలకుడు పాలసీతో ఉండాలి తప్ప, పగతో ఉండకూడదని హితవు పలికారు. ఆ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమీషన్ల దందాపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
