అక్షరటుడే గాంధారి: Saudi Arabia | ఉపాధి కోసం ఏడారి దేశానికి వెళ్లిన ఓ వ్యక్తి అనూహ్య పరిస్థితుల్లో అనారోగ్యం భారిన పడ్డాడు. దీంతో అతడిని స్నేహితులు ఇండియా పంపేందుకు ఎయిర్పోర్ట్లో తీసుకురాగా.. అక్కడ అతడు ఫ్లైట్ ఎక్కకుండా కనిపించకుండా పోయాడు. ఇటు ఇండియా రాకుండా.. సౌదీలో (Saudi Arabia) కనిపించకపోవడంతో ఆయన కుటుంబీకులు తల్లడిల్లిపోతున్నారు.
Saudi Arabia | వివరాల్లోకి వెళ్తే..
గాంధారి మండలకేంద్రానికి చెందిన చాకలి కాశీరాం బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ గొర్ల కాపరిగా పని చేస్తున్నాడు. అయితే అకస్మాత్తుగా అతడి ఆరోగ్యం క్షీణించి ఎవరికీ గుర్తుపట్టలేని స్థితికి వెళ్లిపోయాడు. దీంతో స్పందించిన అతడి స్నేహితులు అంతా కలిసి అతడిని తీసుకుని ఇండియా పంపేందుకు ఏర్పాట్లు చేశారు. అతడిని సౌదీ అరేబియా ఏయిర్పోర్టులో ఇండియాకు టికెట్ బుక్ చేసి.. బోర్డింగ్ పాస్ సైతం ఇప్పించారు. అయితే లోపలికి వెళ్లిన కాశీరాం తర్వాత ఎక్కడికి వెళ్లాడో అంతుచిక్కకుండా పోయింది. ఇటు ఇండియాకు రాక.. సౌదీలో కనిపించకపోవడంతో కుటుంబీకులు తల్లడిల్లిపోతున్నారు. అయితే అతడికి మతిస్థిమితం లేకపోవడంతో పోలీసులు అతడిని అడ్డుకుని ఉంటారని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Saudi Arabia | సాయం చేసినా..
కాశీరాం స్నేహితుడు రమేశ్ కపిల్ అంతాతానై అక్కడ కాశీరాంను ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేశాడని.. కానీ అధికారులు కాశీరాంను నిర్భందించడంతో అతడు సైతం ఏమీ చేయలేని స్థితిలో పడ్డాడని కాశీరాం కుటుంబీకులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కాశీరాంకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక బాబు ఉన్నారు.
కేటీఆర్, ఎమ్మెల్యే మదన్మోహన్ను కలిసిన బాధిత కుటుంబీకులు..
కాశీరాంను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR), ఎమ్మెల్యే మదన్మోహన్ను (MLA Madan Mohan) బాధిత కుటుంబసభ్యులు కలిశారు. ఇండియాకు రప్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
