HomeజాతీయంKarnataka | కర్ణాటకలో సీఎం మారుతారా.. హైకమాండ్​కు చేరిన పంచాయితీ

Karnataka | కర్ణాటకలో సీఎం మారుతారా.. హైకమాండ్​కు చేరిన పంచాయితీ

కర్ణాటకలో సీఎం మార్పుపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. సీఎం సిద్ధరామయ్యను తప్పించి ఆ పదవిని డీకే శివకుమార్​కు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటకలో సీఎం మార్పుపై మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. సీఎం సిద్ధరామయ్యను (CM Siddaramaiah) తొలగించి డీకే శివకుమార్​కు ఆ పదవి అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. డీకే శివకుమార్​ను (DK Shivakumar) సీఎం చేయాలని ఆయన వర్గం వారు డిమాండ్​ చేస్తున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నిలకు (Karnataka Assembly elections) 2023 మేలో జరిగాయి. 224 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్​ 135 స్థానాలను కైవసం చేసుకుంది. అప్పటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ 66 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్​ గెలుపు కోసం సిద్ధరామయ్యతో పాటు, డీకే శివకుమార్​ తీవ్రంగా కృషి చేశారు. దీంతో సీఎం పీఠం కోసం ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్​ అధిష్టానం (congress high command) మాత్రం అంతకు ముందు సీఎంగా చేసిన సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపింది. డీకే వర్గం మాత్రం చెరో రెండున్నరేళ్లు పదవి ఇవ్వాలని డిమాండ్​ చేసింది. సిద్ధరామయ్య సీఎం అయి రెండున్నరేళ్లు పూర్తి అవుతోంది. ఈ క్రమంలో డీకే శివకుమార్​ను సీఎం చేయాలని ఆయన వర్గం తాజాగా మళ్లీ కోరుతోంది.

Karnataka | ఢిల్లీకి చేరిన పంచాయితీ

కర్ణాటకలో అధికారిక పార్టీ పంచాయితీ ఢిల్లీ హైకమాండ్‌కు (Delhi high command) చేరింది. ఈ రోజు రాత్రికి శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లనున్నారు. శివకుమార్​ సీఎం పగ్గాలు ఇవ్వాలని హైకమాండ్‌ను వారు కోరనున్నారు. మరోవైపు సీఎం మార్పు వార్తలు ఊహాగానాలని సీఎం సిద్ధరామయ్య కొట్టిపారేస్తున్నారు. తన స్థానం మొదటి నుండి బలంగా ఉందని, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఐదేళ్ల పాటు అధికారం ఇచ్చారని సీఎం తెలిపారు. తాము ఇచ్చిన ఐదు హామీలను నెరవేర్చడానికి పని చేస్తున్నట్లు చెప్పారు.