Homeతాజావార్తలుDanam Nagender | దానం నాగేందర్​ రాజీనామా చేస్తారా.. అనర్హత పిటిషన్ల ఉత్కంఠ!

Danam Nagender | దానం నాగేందర్​ రాజీనామా చేస్తారా.. అనర్హత పిటిషన్ల ఉత్కంఠ!

అనర్హత పిటిషన్లపై స్పీకర్​ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్​ రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. స్పీకర్​ వేటు వేయకముందే ఆయన రిజైన్​ చేస్తారని సమాచారం.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Danam Nagender | రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లో చేరిన విషయం తెలిసిందే. వారి అనర్హత పిటిషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు (Supreme Court) త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్​పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జులై 31న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అక్టోబర్​ 31తో ఆ గడువు ముగిసింది. అయినా స్పీకర్​ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై బీఆర్​ఎస్​ (BRS) మరోసారి కోర్టును ఆశ్రయించగా.. స్పీకర్​ తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనర్హతపై చర్యలు తీసుకుంటారా.. తమను తీసుకోమంటారా అని ప్రశ్నించింది. నాలుగు వారాల్లో చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలో స్పీకర్​ ప్రసాద్​ కుమార్ విచారణలో వేగం పెంచారు.

Danam Nagender | 8 మంది ఎమ్మెల్యేల విచారణ

స్పీకర్​ ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలను విచారించారు. స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ (Danam Nagender) మాత్రం విచారణకు ఇంకా హాజరు కాలేదు. ఈ క్రమంలో ఈ నెల 23న హాజరు కావాలని స్పీకర్​ ఇద్దరికి నోటీసులు జారీ చేశారు. దీంతో కడియం శ్రీహరి శుక్రవారం స్పీకర్​ను కలిశారు. వివరణ ఇవ్వడానికి మరింత సమయం కావాలని ఆయన కోరారు. కడియం లేఖపై స్పీకర్​ సానుకూలంగా స్పందించారు.

Danam Nagender | దానం ఏం చేస్తారో..

ఇప్పటి వరకు విచారణకు హాజరైన 8 మంది ఎమ్మెల్యేలు తాము బీఆర్​ఎస్​లోనే కొనసాగుతున్నామని చెప్పినట్లు తెలిసింది. అయితే కడియం శ్రీహరి (Kadiyam Srihari) కూతురు కాంగ్రెస్​ నుంచి ఎంపీగా గెలిచారు. ఆమె తరఫున కడియం ప్రచారం చేశారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఆయన సాంకేతిక కారణాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. దీంతోనే ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ ఏకంగా కాంగ్రెస్​ టికెట్​పై సికింద్రాబాద్​ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయనపై వేటు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే దానం ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. త్వరలోనే ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దానం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక స్పీకర్‌ను కలిసే అవకాశం ఉంది.

Danam Nagender | కేటీఆర్​ ఏమన్నారంటే..

అనర్హత పిటిషన్లపై కేటీఆర్​ (KTR) శుక్రవారం మాట్లాడారు. సాంకేతిక కారణాలతో కడియం శ్రీహరిని కాపాడి దానం నాగేందర్‌తో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఖైరతాబాద్​లో ఉప ఎన్నికలు వస్తాయని ఆయన అన్నారు. ముందుగా జీహెచ్​ఎంసీ ఎన్నికలు (GHMC Elections) వస్తాయని, అనంతరం ఉప ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. దానం కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేసి దొరికిపోయారన్నారు. అనర్హత వేటు పడితే పరువు పోతుందని ముందుగానే రాజీనామా చేయించాలని చూస్తున్నారని చెప్పారు.