అక్షర టుడే, ఇందూరు : BJP Nizamabad | హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిఖిల్ సాయి చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ.. హిందూ దేవతలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సిగ్గుచేటన్నాడు. రేవంత్ రెడ్డి కూడా హిందూమతంలోనే ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గర్హనీయమని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఒక మతం కోసం పని చేస్తూ.. ఇతర మతాలను కించపర్చడం అలవాటైందన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-Election) గెలుపొందగానే కళ్లు నెత్తికెక్కాయని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలోనూ కేసీఆర్ హిందు గాళ్లు.. బొందుగాళ్లు అంటూ వ్యాఖ్యలు చేస్తే.. ప్రస్తుతం ఏమైందో అందరికీ తెలుసని ఆయన గుర్తు చేశారు. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోల్ల లక్ష్మీనారాయణ, స్వామి యాదవ్, నరేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
