అక్షరటుడే, వెబ్డెస్క్ : Virat Kohli | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) RCB తరఫున ఇప్పటి వరకు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనలతో మెరిసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు టీంకి గుడ్ బై చెప్పనున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించిన కమర్షియల్ కాంట్రాక్ట్పై కోహ్లీ సంతకం చేయలేదనే ప్రచారం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. అయితే ఈ వార్తలపై టీమిండియా (Team India)మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ స్పష్టతనిచ్చాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా విడుదల చేసిన వీడియోలో కైఫ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ (Virat Kohli)ఎక్కడికీ వెళ్లడంలేదు. అతను బెంగళూరు జట్టుకి అంకితభావంతో ఆడతాడు. తన మొదటి, చివరి మ్యాచ్ను ఆర్సీబీ తరఫునే ఆడుతానని అతను ఇప్పటికే చెప్పాడు. ఆ మాట తప్పడు” అని తెలిపారు.
Virat Kohli | అసలు క్లారిటీ ఇదే..
అయితే, కోహ్లీ కమర్షియల్ ఒప్పందంపై సంతకం చేయకపోవడానికి వెనుక కారణం ఉందని కైఫ్ (Mohammed Kaif) వెల్లడించాడు.“ఒక్కో ఫ్రాంచైజీకి ఆటగాళ్లు రెండు రకాల కాంట్రాక్టులు సైన్ చేస్తారు. ఒకటి ప్లేయర్ కాంట్రాక్ట్, మరొకటి కమర్షియల్ డీల్. ఆర్సీబీ యాజమాన్యంలో మార్పులు జరగవచ్చనే సమాచారం ఉంది. కొత్త యజమానులు వస్తే కమర్షియల్ ఒప్పందాల షరతులు మారవచ్చు. అందుకే కోహ్లీ ప్రస్తుతం వేచి చూస్తున్నాడు. ఇది సాధారణ ప్రక్రియ మాత్రమే” అని కైఫ్ వివరించాడు. ఇటీవలి కాలంలో కోహ్లీ ఫామ్ పీక్లో ఉందని ఆయన గుర్తు చేశాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ, టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో 650కి పైగా పరుగులు చేసి ఆర్సీబీ (RCB)టైటిల్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అతని అసలు ఆట మొదలైంది అని అన్నారు. మొత్తానికి, కోహ్లీ ఆర్సీబీని విడిచిపెడతాడన్న వార్తలు నిరాధారమని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కైఫ్ స్పష్టం చేశాడు. “కోహ్లీ ఆర్సీబీ కోసమే ఆడతాడు. అభిమానులకు ఇచ్చిన మాట తప్పడు అని కైఫ్ తేల్చి చెప్పడంతో ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు.