అక్షరటుడే, వెబ్డెస్క్ : Mahabubnagar | మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్లోని ప్రసిద్ధ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం(Sri Vasavi Kanyaka Parameshwari Temple) దసరా సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో చేపట్టిన ప్రత్యేక అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఏడాది ఆలయంలో రూ.1.25 కోట్ల విలువైన నూతన కరెన్సీ నోట్లతో తయారు చేసిన మాలలతో అమ్మవారిని విశిష్టంగా అలంకరించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ వైభవోపేత అలంకరణను నిర్వహించారు. అమ్మవారిని ద్రవ్య మాలలతో అలంకరించిన దృశ్యం చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు
Mahabubnagar | ప్రత్యేక అలంకరణ..
కేవలం కొల్లాపూర్(Kollapur) నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. దసరా మహోత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ప్రతిరోజూ ఒక ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం(Arya Vaishya Sangham) ప్రతినిధులు, స్థానికులు కలిసి ప్రత్యేక అలంకరణ కార్యక్రమాల్లో భాగంగా సంప్రదాయం మరియు ఆధునికతకు మేళవింపుగా అమ్మవారిని అలంకరిస్తున్నారు.
ఈ ప్రత్యేక కరెన్సీ అలంకరణ ఆలయాన్ని కొత్త శోభను కలిగించడంతో పాటు దసరా ఉత్సవాలకు మరింత మహిమను చేకూర్చింది. భక్తుల సద్వినియోగం కోసం ఆలయ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఇక తెలుగు రాష్ట్రాలలో నవరాత్రి ఉత్సవాలు కనులపండుగగా జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తున్నారు.