అక్షరటుడే, వెబ్డెస్క్ : MP Arvind | విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారత యువతను తరలించి సైబర్ మోసాలు (Cyber Crimes) చేయిస్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్ నేర గ్యాంగ్లకు బందీలుగా మార్చుతున్న సమస్యను లోక్సభలో ఆయన గురువారం లేవనెత్తారు.
తెలుగు రాష్ట్రాల యువతకు థాయ్లాండ్లో (Thailand) ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి, ఏజెంట్లు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్పారు. అక్కడికి చేరిన వెంటనే వారి పాస్పోర్టులను స్వాధీనం చేసుకుని మయన్మార్లోని మయావడ్డి వంటి తిరుగుబాటు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సైబర్ నేర శిబిరాలకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. బాధితులకు తీవ్రమైన హింస, ఆహారం ఇవ్వకపోవడం, చీకటి గదుల్లో నిర్బంధం వంటి దారుణాలు జరుగుతున్నాయని కుటుంబాలు తమకు సమాచారం అందించాయని తెలిపారు.
MP Arvind | చర్యలు తీసుకోవాలి
ఈ నేరాలకు అక్కడి అధికారులు కొందరు సహకరిస్తున్నారని ఎంపీ ఆరోపించారు. దీంతో అక్కడ చిక్కుకున్న వారిని రక్షించడం మరింత కష్టతరం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ (Nizamabad) నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు కూడా ఈ ముఠాకు బలి అయ్యి ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అత్యవసరంగా పరిగణించి, చిక్కుకున్న భారతీయులను రక్షించాలని ఆయన కోరారు. వెనుకబడ్డ జిల్లాల్లో విదేశీ ఉద్యోగ మోసాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నేరాలకు సహకరిస్తున్న భారతీయ ఏజెంట్లు, రిక్రూటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
