అక్షరటుడే, వెబ్డెస్క్ : Maoists | మావోయిస్టులు మరో సంచలన ప్రకటన చేశారు. అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డి తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు మావోయిస్టు వికల్ప్ (Maoist Vikalp) పేరుతో శుక్రవారం లేఖ విడుదల చేశారు.
ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందిన విషయం తెలిసిందే. అంతేగాకుండా పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. వారిని వెంటనే విడుదల చేయాలని మావోయిస్టులు సైతం లేఖ విడుదల చేశారు. దేవ్జీపాటు మరో 50 మంది నక్సల్స్ (Naxals)ను పోలీసులు పట్టుకున్నారని అందులో పేర్కొన్నారు. అయితే తాజాగా దేవ్జీ తమతోనే ఉన్నారని వారు క్లారిటీ ఇచ్చారు.
Maoists | అది అవాస్తవం
హిడ్మా (Madvi Hidma) సమాచారాన్ని దేవ్జీ చెప్పారనడం అవాస్తవమని లేఖలో పేర్కొన్నారు. చికిత్స కోసం హిడ్మా విజయవాడ వెళ్లాడన్నారు. హిడ్మా ఎన్కౌంటర్కు నలుగురు వ్యక్తులే కారణమని ఆరోపించారు. కోసాల్ అనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నీచర్ వ్యాపారి, కాంట్రాక్టర్ హిడ్మాను పోలీసులకు పట్టించారన్నారు. అక్టోబరు 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లారని వికల్ప్ లేఖలో పేర్కొన్నారు. అనంతరం పోలీసులు హిడ్మాను పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్ (Encounter) చేశారని ఆరోపించారు. తాము లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని స్పష్టం చేశారు. మారేడుమిల్లి (Maredumilli) ఎన్కౌంటర్కు ప్రతీకారం తీర్చుకుంటామని లేఖలో పేర్కొన్నారు.
