అక్షరటుడే, బాన్సువాడ: MLa Pocharam | డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వం వ్యవసాయం సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. పట్టణ శివారులో ఆదివారం రూ.20లక్షల వ్యయంతో వారాల సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం పాత బాన్సువాడ చావడి వద్ద రూ.15లక్షలతో నిర్మించిన నూతన చావిడి భవనాన్ని ప్రారంభించారు.
MLa Pocharam | మహిళలకు పెద్దపీట..
పాత బాన్సువాడలోని (Banswada) హనుమాన్ ఫంక్షన్ హాల్లో డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ క్రమంలోనే వారికి పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తోందన్నారు.
ఇప్పటికే ఇందిరమ్మ క్యాంటీన్ల (Indira Amma canteens) నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ బాలరాజు, కృష్ణారెడ్డి, నార్ల సురేష్, ఎజాజ్, గంగాధర్, లింగం, ఖాలెక్, గోపాల్ రెడ్డి, మహమ్మద్ గౌస్, విఠల్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
