అక్షరటుడే, వెబ్డెస్క్ : Film industry | ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమా (Cinema)లను కొందరు పైరసీ చేసి ఆన్లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. దీంతో నిర్మాతల (Producers)కు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం చేకూరుస్తున్న పైరసీకి వ్యతిరేకంగా అన్ని భాషల ఇండస్ట్రీలు పోరాడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ (Hyderabad) పోలీసులు దేశంలోనే పెద్ద పైరసీ ముఠాను అరెస్ట్ చేశారు.
పైరసీ ముఠాకు చెందిన ఆరుగురు నిందితులను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police) అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా తెలుగుతో సహా ఇతర భాషల చిత్రాలను సైతం పైరసీ చేస్తున్నట్లు గుర్తించారు. వీరు ఇండస్ట్రీకి దాదాపు రూ.22 వేల కోట్ల నష్టం చేసినట్లు పోలీసులు అంచనా వేశారు.
Film industry | ఇలా దొరికారు..
శ్రీ విష్ణు హీరోగా తెలుగులో సింగిల్ మూవీ (Single Movie)ని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ (Geetha Arts) బ్యానర్పై నిర్మించారు. ఈ చిత్రం మే 1న విడుదలైంది. అయితే ఈ సినిమాను కొందరు పైరసీ చేశారు. దీంతో చిత్ర బృందం గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు జులై 3న వనస్థలిపురానికి చెందిన కిరణ్ను పైరసీ కేసులో అరెస్ట్ చేశారు. అతడిని విచారించి ముఠా సభ్యులు దుబాయి, మయన్మార్, నెదర్లాండ్ కేంద్రంగా దందా చేస్తున్నట్లు గుర్తించారు. తాజాగా అందులో ఆరుగురిని అరెస్ట్ చేశారు.
Film industry | పైరసీతో తీవ్ర నష్టం
చిత్ర పరిశ్రమకు పైరసీతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వేల మంది కష్టపడి, వందల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన సినిమాను కొందరు పైరసీ చేస్తున్నారు. దీంతో ప్రజలు థియేటర్లకు రాకుండా పైరసీ కాపీలను చూస్తున్నారు. కొన్ని వెబ్సైట్లలో అయితే చిత్రం రిలీజ్ కాగానే పైరసీ కాపీ అప్లోడ్ చేస్తున్నారు. ఫలితంగా ఆయా సినిమాలకు భారీగా నష్టం వస్తోంది. కాగా అడ్డగోలుగా సినిమా ధరల పెంపు (Ticket Rates), థియేటర్లలో దోపిడీ సైతం ప్రజలను పైరసీ చూసేలా చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.