అక్షరటుడే, వెబ్డెస్క్ : CBI Raid | భారీ అవినీతి తిమింగలాన్ని సీబీఐ అధికారులు (CBI Officers) అరెస్ట్ చేశారు. రూ.10 లక్షల లంచం తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి అతడి ఇళ్లలో సోదాలు చేపట్టారు.
గౌహతి (Guwahati)లోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రాంతీయ అధికారి మైస్నామ్ రిటెన్ కుమార్ సింగ్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేసింది. కోల్కతాకు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి అనుచిత ప్రయోజనం కల్పించడానికి ఆయన లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు సదరు కంపెనీ ప్రతినిధి నగదును అందజేస్తుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. డెమో, మోరన్ బైపాస్ మధ్య నేషనల్ హైవే-37లో నాలుగు లేన్ల ప్రాజెక్ట్ గడువు పొడిగింపు కోసం సదరు అధికారి లంచం డిమాండ్ చేశాడు.
CBI Raid | భారీగా నగదు స్వాధీనం
మైస్నామ్ రిటెన్ కుమార్ సింగ్ను అరెస్ట్ చేసిన అనంతరం సీబీఐ నిందితుడికి సంబంధించిన ఏడు ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. ఈ ఆపరేషన్లో సింగ్, అతని కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న తొమ్మిది భూమికి సంబంధించిన ఆస్తి పత్రాలు, 20 అపార్ట్మెంట్లకు సంబంధించిన పత్రాలతో పాటు రూ. 2.62 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఖరీదైన వాహనాల కొనుగోలుకు సంబంధించిన పత్రాలను కూడా గుర్తించారు. నిందితుడిని అధికారులు బుధవారం గౌహతిలోని ప్రత్యేక న్యాయమూర్తి కోర్టులో హాజరు పర్చారు. ఆస్తుల విలువ లెక్కిస్తున్నామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.