అక్షరటుడే, నవీపేట్: Navipet | వరద ఉధృతితో పంటలు కొట్టుకుపోగా.. తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బినోలా (Binola) సొసైటీ మాజీ ఛైర్మన్ మగ్గరి హన్మాండ్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం యంచ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవీపేట్ మండలంలోని తొమ్మిది గ్రామాల్లో గోదావరి (Godavari) వరద కారణంగా సుమారు 4వేల ఎకరాల్లో పంట మొత్తం మునిగిపోయిందన్నారు. పంట పూర్తిగా కుళ్లిపోయిందని రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందన్నారు. అయితే పంటనష్టం వివరాలను రెండు వారాల క్రితం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి (Collector Vinay Krishna Reddy), స్థానిక తహశీల్దార్కు వినతిపత్రాల ద్వారా అందజేశామని వివరించారు.
కానీ కనికరం లేని ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని వాపోయారు. దీంతో విసిగిపోయిన తాము యంచ రహదారిపై మహాధర్నా చేపట్టామని వివరించారు. నష్టపోయిన రైతులకు వెంటనే ఎకరానికి రూ.50వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లాలోని రైతులందరినీ ఏకంచేసి పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో తొమ్మిది గ్రామాల రైతులతో పాటు అన్ని రాజకీయ పార్టీ నాయకులు, పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు సరీన్, శ్రీకాంత్, కరుణాకర్, బీఆర్ఎస్ నాయకులు నర్సింగ్ రావు, సంజీవ్, లాలు, ప్రవీణ్, కృష్ణ, పోశెట్టి, అన్ని గ్రామల రైతులు పాల్గొన్నారు.