Homeక్రీడలుWomen World Cup 2025 | బోణీ కొట్టిన భార‌త జ‌ట్టు.. అదరగొట్టిన కార్పెంట‌ర్ కూతురు

Women World Cup 2025 | బోణీ కొట్టిన భార‌త జ‌ట్టు.. అదరగొట్టిన కార్పెంట‌ర్ కూతురు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Women World Cup 2025 | 2025 మహిళల వన్డే వరల్డ్ కప్‌లో World Cup భారత మహిళల జట్టు శుభారంభం చేసింది.

తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకను 59 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. వర్షం ఆటకు ఆటంకం కలిగించినా.. డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ (Duckworth Lewis Stern – DLS) పద్ధతిలో లక్ష్యం సవరించడంతో భారత జట్టు సమష్టి ప్రదర్శన చేసి విజయం సాధించడం విశేషం.

ఈ విజయంలో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ Deepti Sharma అద్భుతంగా రాణించింది. బ్యాట్‌తో అర్ధ సెంచరీ (53 పరుగులు), బంతితో 3 వికెట్లు తీసి మ్యాచ్ విజేతగా నిలిచింది.

ఆమెకు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగగా, నిర్ణీత ఓవర్లలో 269 పరుగులు చేసింది.

Women World Cup 2025 | ఆరంభం అదిరింది..

హర్లీన్ డియోల్ 48 పరుగులు, ప్రతికా రావల్ 37 పరుగులు, దీప్తి శర్మ 53 పరుగులు, అమన్‌జోత్ కౌర్ 57 పరుగులు (56 బంతుల్లో), స్నేహ్ రాణా మెరుపు ఇన్నింగ్స్‌తో 15 బంతుల్లో 28 పరుగులు చేశారు.

ఒకానొక స‌మ‌యంలో 120 ప‌రుగులకే నాలుగు వికెట్స్ కోల్పోగా, భారత్‌కు దీప్తి-అమన్‌జోత్ Amanjot Kaur భాగస్వామ్యం (103 పరుగులు) కీలకంగా నిలిచింది. వర్షం కారణంగా మ్యాచ్‌లో DLS రూల్ అమలైంది.

శ్రీలంకకి 47 ఓవర్లలో 271 పరుగులు లక్ష్యంగా నిర్దేశించారు. శ్రీలంక బ్యాటర్లు భారత బౌలింగ్‌కి తలవంచారు. టాప్ ఆర్డర్ వెంట వెంటనే ఔటవ్వడంతో 140 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయింది.

నిలాక్షి డిసిల్వా 35 పరుగులతో పోరాడినప్పటికీ ఆమెను స్నేహ్ రాణా క్లీన్ బౌల్డ్ చేసింది. చివరకు శ్రీలంక Srilanka 211 పరుగులకే ఆలౌట్ అయింది.

ఈ విజయంలో అమన్‌జోత్ కౌర్ అనే యువ క్రికెటర్ కీలక పాత్ర పోషించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఆమె కార్పెంట‌ర్ కూతురు కాగా, ప‌ట్టుద‌ల‌తో ఇక్క‌డికి చేరుకొని మంచి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది.

ఇండియా 269 ప‌రుగుల భారీ స్కోరు రావడానికి అమన్‌జోత్ కౌర్ ముఖ్య కారణంగా చెప్ప‌వ‌చ్చు. ఆమె కేవలం 56 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 57 పరుగులు చేసింది.

8వ స్థానంలో బ్యాటింగ్ చేసి అర్ధ సెంచ‌రీ సాధించింది. ఆగస్టు 25, 2000న మోహాలీలో ఆమె జ‌న్మించింది. ఆమె తండ్రి భూపిందర్ సింగ్ ఒక కార్పెంటర్.

త‌న కూతురు క్రికెట్ ఆడటం తండ్రికి మొదట్లో ఇష్టం లేకపోయినా, అమ్మ‌మ్మ మ‌ద్దతుతో మోహాలీ ఈ రంగంలోకి వ‌చ్చింది.

ఇక్క‌డ విశేషం ఏమిటంటే అమన్‌జోత్ ఉపయోగించిన మొదటి బ్యాట్‌ను Cricket Bat కూడా ఆమె తండ్రే స్వయంగా తయారు చేసి ఇచ్చాడు.

ఇక 15 సంవత్సరాల ఏజ్‌ వరకు కూడా అమ‌న్ జోత్‌ క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్, హాకీ, హ్యాండ్‌బాల్‌ వంటి ఆటలను అబ్బాయిలతో కలిసి ఆడుతూ వ‌చ్చింది. అనంత‌రం నాగేశ్ గుప్తా అకాడమీలో చేరి, క్రికెట్ వైపు అడుగులు వేసింది.

Related News