అక్షరటుడే, వెబ్డెస్క్ : Swaraj Kaushal | దివంగత బీజేపీ నాయకురాలు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (Sushma Swaraj) భర్త స్వరాజ్ కౌశల్ (73) గురువారం కన్నుమూశారు. మిజోరాం (Mizoram) మాజీ గవర్నర్, సీనియర్ న్యాయవాది అయిన కౌశల్ అనారోగ్య కారణాలతో ఎయిమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయారు.
కౌశల్ 1952 జులై 12న హిమాచల్ ప్రదేశ్లోని (Himachal Pradesh) సోలన్లో జన్మించారు. 37 ఏళ్లకే మిజోరం గవర్నర్గా నియమితులయ్యారు. ఆయన భార్య సుష్మా స్వరాజ్ ఢిల్లీ (Delhi) ముఖ్యమంత్రిగా పని చేశారు. భారత విదేశాంగమంత్రిగా సేవలందించారు. 2019 ఆగస్టు 6న ఆమె చనిపోయారు.
కౌశల్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ప్రస్తుతం న్యూఢిల్లీ ఎంపీగా ఉన్నారు. ఆమె తన తండ్రి మృతిపై ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తన తండ్రి ఆప్యాయత, క్రమశిక్షణ, సరళత, దేశభక్తి, ఓర్పు తన జీవితానికి వెలుగు అని, అది ఎప్పటికీ తగ్గదన్నారు. మధ్యాహ్నం కౌశల్ ఛాతీ నొప్పి రావడంతో AIIMS కు తరలించారు. అక్కడ వైద్యులు ఆయన మరణించినట్లు ప్రకటించారని బీజేపీ నాయకులు తెలిపారు.
Swaraj Kaushal | ప్రధాని సంతాపం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మిజోరాం మాజీ గవర్నర్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. స్వరాజ్ కౌశల్ జీ మరణం బాధాకరం. న్యాయవాదిగా మరియు నిరుపేదల జీవితాలను మెరుగుపరచడానికి న్యాయవాద వృత్తిని ఉపయోగించడంలో నమ్మకం ఉంచిన వ్యక్తిగా ఆయన తనను తాను ప్రత్యేకించుకున్నారు అని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
దేశంలో అతి చిన్న వయసులో గవర్నర్ అయ్యారని గుర్తు చేశారు. గవర్నర్గా తన పదవీకాలంలో మిజోరాం ప్రజలపై శాశ్వత ముద్ర వేశారని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, ఢిల్లీ సీఎం రేఖాగుప్తా స్వరాజ్ కౌశల్ అకాల మరణంపై విచారం వ్యక్తం చేశారు.
