అక్షరటుడే, బోధన్: Bodhan Municipality | బోధన్ పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం తారాస్థాయికి చేరిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మున్సిపల్ కార్యాలయానికి ఉన్నతాధికారులే సమయానికి రాకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది సైతం ఇష్టారాజ్యంగా ఆఫీస్కు వచ్చిపోతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Bodhan Municipality | సబ్ కలెక్టర్ నిరీక్షించాల్సి వచ్చింది..
జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ (Additional Collector Ankit) సోమవారం బోధన్ పర్యటనకు రానున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ(Municipal Commissioner Jadhav Krishna), మేనేజర్ రమేష్తో చర్చించేందుకు సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Sub Collector Vikas Mahato) మున్సిపల్ కార్యాలయానికి ఉదయం వచ్చారు. అయితే ఆయన వచ్చిన సమయానికి కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, మేనేజర్ ఇద్దరూ అందుబాటులో లేరు.
దీంతో సబ్కలెక్టర్ బల్దియా కార్యాలయం ఎదుటే వేచిఉండాల్సి వచ్చింది. అనంతరం చేసేదేమీ లేక కార్యాలయ సిబ్బంది సహకారంతో ఆయన ఫైళ్లను పరిశీలించారు. ఉదయం 11.30 అవుతున్నా ఉన్నతాధికారులు కార్యాలయానికి రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.
