అక్షరటుడే, వెబ్డెస్క్: Palapitta | తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట ప్రమాదంలో పడింది. రోజురోజుకు పాలపిట్టల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో (Telangana) పాలపిట్టను శుభానికి సంకేతంగా భావిస్తారు. దసరా రోజు పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ క్రమంలో తెలంగాణ ఏర్పాటయిన తర్వాత ప్రభుత్వం పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ప్రకటించింది. అయితే గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా పాలపిట్టల సంఖ్య 30 శాతం తగ్గిపోయింది. దీంతో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ఆ పక్షిని రెడ్ లిస్ట్లో జాబితాలో చేర్చింది. కాగా.. కర్ణాటక, ఒడిశా రాష్ట్ర పక్షి (Odisha State Bird) కూడా పాలపిట్ట కావడం గమనార్హం.
Palapitta | మరో మూడు పక్షులు
నాలుగు భారతీయ పక్షి జాతులు ఇండియన్ కోర్సర్ (Indian Courser) , ఇండియన్ రోలర్, రూఫస్-టెయిల్డ్ లార్క్, లాంగ్-బిల్డ్ గ్రాస్హాపర్-వార్బ్లెర్లను IUCN అధిక ముప్పు ఉన్న పక్షుల జాబితాలో చేర్చింది. 1964లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంస్థను ఏర్పాటు చేసింది. ఇది పక్షుల సంరక్షణకు చర్యలు చేపడుతోంది. పక్షుల సంఖ్యలో మార్పుల ఆధారంగా వాటిని ఆయా జాబితాల్లో చేరుస్తుంది. తక్కువ ఆందోళన, దుర్బలంగా, అంతరించిపోతున్న, తీవ్రంగా అంతరించిపోతున్న, అడవిలో అంతరించిపోయిన జాబితా పేరుతో పక్షుల వివరాలు వెల్లడిస్తోంది.
Palapitta | పలు మార్పులు
ఐయూసీఎన్ అక్టోబర్ 10న అబుదాబిలో కొత్త జాబితా విడుదల చేసింది. దీనిలో 12 భారతీయ పక్షి (Indian Bird) జాతుల పరిరక్షణ స్థితిలో మార్పులను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా రెడ్ లిస్ట్లో ఇప్పుడు 1,72,620 జాతులు ఉన్నాయి. వాటిలో 48,646 అంతరించిపోయే ప్రమాదం ఉందని సంస్థ తెలిపింది. 8 భారతీయ జాతి పక్షుల సంఖ్య పెరగడంతో సంస్థ వాటిని డౌన్లిస్ట్ చేసింది. వాటి పరిరక్షణ స్థితిలో సానుకూల ధోరణిని ఇది సూచిస్తుంది. అయితే నాలుగు పక్షి జాతులు ‘అప్లిస్ట్’ చేయబడ్డాయి. వాటిలో పాలపిట్ట కూడా ఉంది. అడవులు తగ్గడంతో పక్షులు అంతరించిపోతున్నాయని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.