అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (SRSP)లోకి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు 37 వరద గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.
జలాశయంలోకి ప్రస్తుతం 1.40 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 1090.90 (80.05 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. రాష్ట్రంలో, మహారాష్ట్రలో వర్షాలు పడుతుండటంతో ప్రాజెక్ట్కు వరద పెరిగే అవకాశం ఉంది. దీంతో అధికారులు గోదావరిలోకి నీటి విడుదలను పెంచారు. శనివారం తొమ్మిది గేట్ల ద్వారా దిగువకు నీటిని వదిలిన అధికారులు ఆదివారం 37 గేట్లను ఎత్తారు.
Sriram Sagar | నీటి విడుదల వివరాలు
ఎస్సారెస్పీ నుంచి 37 గేట్ల ద్వారా 1.50 లక్షల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేలు, కాకతీయ కాలువకు 4 వేలు, సరస్వతి కాలువకు 650, లక్ష్మి కాలువకు 200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల పోతోంది. దీంతో మొత్తం ఔట్ ఫ్లో 1,59,790 క్యూసెక్కులుగా ఉంది. ఎగువ నుంచి వరద పెరిగే అవకాశం ఉండటంతో గేట్ల ద్వారా నీటి విడుదల పెంచుతామని, గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Sriram Sagar | నిజాంసాగర్లోకి..
అక్షరటుడే, ఎల్లారెడ్డి : నిజాంసాగర్ (Nizam Sagar) ప్రాజెక్ట్లోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 21,377 క్యూసెక్కుల వరద వస్తోంది. వరద గేట్ల ద్వారా 19,083 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17.6 టీఎంసీల నీరు నిల్వ ఉంది.