అక్షరటుడే, వెబ్డెస్క్ : Sodhani Capital IPO | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic Stock Market)లో మంగళవారం ఏడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో రెండు ఎస్ఎంఈ IPOలు మంచి లాభాలను అందించగా.. ఒక మెయిన్బోర్డ్ కంపెనీ, మరో ఎస్ఎంఈ కంపెనీ భారీ నష్టాలను మిగిల్చాయి.
గ్లాటిస్ లిమిటెడ్ : మెయిన్బోర్డ్కు చెందిన గ్లాటిస్ లిమిటెడ్(Glottis Ltd) మార్కెట్నుంచి రూ. 307 కోట్లు సమీకరించాలని లక్ష్యంతో ఐపీవోకు వచ్చింది. పబ్లిక్ ఇష్యూ(Public issue) గతనెల 29 న ప్రారంభమై ఈనెల ఒకటో తేదీ వరకు అందుబాటులో ఉంది. కంపెనీ షేర్లు మంగళవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయ్యాయి. ఐపీవో ఇన్వెస్టర్లకు ఈ కంపెనీ భారీ నష్టాలను మిగిల్చింది. ఇష్యూ ప్రైస్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 129 కాగా.. రూ. 45 డిస్కౌంట్(Discount)తో రూ. 84 వద్ద లిస్టయ్యింది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలో 34 శాతం నష్టాలను మిగిల్చిందన్నమాట. ఆ తర్వాత కాస్త కోలుకుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో 29.5 శాతం నష్టంతో 91.50 వద్ద ట్రేడ్ అవుతోంది.
ధిల్లాన్ ఫ్రైట్ క్యారియర్ : మార్కెట్నుంచి రూ. 9.57 కోట్లు సమీకరించేందుకోసం ఎస్ఎంఈ సెగ్మెంట్కు చెందిన ధిల్లాన్ ఫ్రైట్ క్యారియర్(Dhillon Freight Carrier) ఐపీవోకు వచ్చింది. ఈ కంపెనీ షేర్లు బీఎస్ఈ(BSE)లో లిస్టయ్యాయి. ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 72 కాగా.. రూ. 14.60 డిస్కౌంట్తో రూ. 57.60 వద్ద లిస్టయ్యింది. అంటే ఐపీవో అలాట్ అయినవారు లిస్టింగ్ సమయంలో 20 శాతం నష్టపోయారన్నమాట. ఆ తర్వాత మరింత పడిపోయి రూ. 54.72 వద్ద లోయర్ సర్క్యూట్ను తాకింది.
సోధని క్యాపిటల్ : ఎస్ఎంఈ సెగ్మెంట్కు చెందిన సోధని క్యాపిటల్(Sodhani Capital) రూ. 10.17 కోట్లు సమీకరించేందుకు ఐపీవోకు వచ్చింది. కంపెనీ షేర్లు మంగళవారం లిస్టయ్యాయి. ఒక్కో ఈక్విటీ షేరు ధర 51 కాగా.. రూ. 29 ప్రీమియంతో రూ. 80 వద్ద లిస్టయ్యాయి. అంటే లిస్టింగ్ సమయంలో ఇన్వెస్టర్లకు 56.86 శాతం లాభం వచ్చిందన్న మాట. లిస్టింగ్ తర్వాత ధర మరింత పెరిగింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో 57.67 శాతం లాభంతో రూ. 80.41 వద్ద ఉంది.
సుబా హోటల్స్ : ఎస్ఎంఈ సెగ్మెంట్కే చెందిన సుబాహోటల్స్(Suba Hotels) ఎస్ఎంఈ కంపెనీ ఐపీవో ద్వారా రూ. 71.69 కోట్లు సమీకరించింది. ఈ కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ(NSE)లో లిస్టయ్యాయి. ఇష్యూ ప్రైస్ రూ. 111 కాగా.. రూ. 44.20 ప్రీమియంతో రూ. 154.20 వద్ద లిస్టయ్యాయి. అంటే లిస్టింగ్ సమయంలో ఇన్వెస్టర్లకు 38.92 శాతం లాభాలు వచ్చాయన్నమాట. ఆ తర్వాత షేర్ ప్రైస్ మరింత పెరిగి రూ. 161.90 వద్ద అప్పర్ సర్క్యూట్ కొట్టింది.
మరో మూడు ఫ్లాట్గా : మెయిన్బోర్డ్కు చెందిన ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్(Fabtech Technologies) లిమిటెడ్ కంపెనీ మార్కెట్నుంచి రూ. 230.35 కోట్లు సమీకరించింది. కంపెనీ షేర్లు మంగళవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్టయ్యాయి. ఒక్కో ఈక్విటీ షేరు ధర రూ. 191 కాగా.. ఒక రూపాయి లాభంతో రూ. 192 వద్ద ప్రారంభమైంది. లిస్టింగ్ సమయంలో ఇన్వెస్టర్లకు 0.52 శాతం లాభం వచ్చింది.
ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ కంపెనీ విజయ్పీడీ స్యూటికల్(Vijaypd Ceutical) కంపెనీ షేర్లు ఫ్లాట్గా లిస్టవగా.. బీఎస్ఈ ఎస్ఎంఈ కంపెనీ ఓం మెటాలాజిక్(Om Metallogic) షేర్లు 1.16 శాతం డిస్కౌంట్తో ప్రస్థానాన్ని ప్రారంభించాయి.