అక్షరటుడే, వెబ్డెస్క్ : Flights Delay | దేశవ్యాప్తంగా పలు విమానాల రాకపోకల్లో ఆలస్యం నెలకొంది. దీంతో మంగళవారం రాత్రి నుంచి ప్రయాణికులు (Passengers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పలు విమానాశ్రయాల్లోని చెక్-ఇన్ కౌంటర్లలో వ్యవస్థలో అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. సాంకేతిక లోపం కారణంగా అనేక విమానాలు ఆలస్యం అయ్యాయని అధికారులు తెలిపారు. మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో తలెత్తిన సమస్యతో ఎయిర్పోర్టు (Airports)ల్లో ఐటీ సేవలు, చెక్-ఇన్ వ్యవస్థలు ప్రభావితమయ్యాయి. దీంతో కార్యకలాపాలను కొనసాగించడానికి విమానయాన సంస్థలు మాన్యువల్ చెక్-ఇన్, బోర్డింగ్ ప్రక్రియలకు మారాయని కూడా అధికారులు తెలిపారు. ఇండిగో, స్పైస్జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు ప్రభావితం అయ్యాయి.
సాంకేతిక సమస్యపై ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (Delhi International Airport) లిమిటెడ్ ఎక్స్ వేదికగా స్పందించింది. కొన్ని దేశీయ విమానయాన సంస్థలు ప్రస్తుతం సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. దీంతో విమానాలు ఆలస్యం, రద్దు కావొచ్చని తెలిపింది. తమ సిబ్బంది ప్రయాణికుల సౌకర్యం కోసం అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
Flights Delay | అయ్యప్ప భక్తుల పాట్లు
శంషాబాద్ విమానాశ్రయం (Shamshabad Airport)లో సైతం పలు విమానాల రాకపోకల్లో ఆలస్యం అవుతోంది. దీంతో శబరిమల వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ నుంచి ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, గోవా, భువనేశ్వర్ వెళ్లాల్సిన కొన్ని విమానాలు రద్దయ్యాయి. ఎయిర్లైన్స్ ఆపరేషనల్ ఇష్యూస్ కారణంగా విమానాలు రద్దయినట్లు వెల్లడించారు. మంగళవారం రాత్రి నుంచి ప్రయాణికులు ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. విమానం ఎప్పుడు వస్తుందో సిబ్బంది చెప్పడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
