అక్షరటుడే, వెబ్డెస్క్ : Mopal Police | ఏడుగురు గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.1 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ మేరకు సౌత్ రూరల్ సీఐ (South Rural CI) సురేశ్ కుమార్ శుక్రవారం వివరాలు వెల్లడించారు.
మోపాల్ మండలం కంజర్ గ్రామ శివారులో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం రావడంతో మోపాల్ ఎస్సై సుష్మిత వెంటనే తన సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు వినాయక్ నగర్కు చెందిన అమీర్ ఖాన్, నర్సింగ్పల్లికి చెందిన షేక్ అఫ్రోజ్, కంజర్కు చెందిన శివతేజలను అదుపులోకి తీసుకున్నారు.
Mopal Police | రైలులో గంజాయి రవాణా
ముగ్గురు నిందితులు నాందేడ్కు (Nanded) రైళ్లలో వెళ్లి గంజాయి తీసుకు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ షేక్ ఇమ్రాన్, మిర్జా జుబేర్ బేగ్ అనే వ్యక్తుల నుంచి గంజాయిని కిలోకు రూ.10 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దానిని మోపాల్ తీసుకొచ్చి 5 గ్రాముల చొప్పున విక్రయిస్తున్నారు. 5 గ్రాముల ప్యాకెట్ను రూ.200 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. మైనర్లు, కాలేజీ విద్యార్థులకు సైతం వీరు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Mopal Police | నాందేడ్కు వెళ్లి ఆపరేషన్
కంజరలో దొరికిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు నాందేడ్ వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి గంజాయి అమ్ముతున్న షేక్ ఇమ్రాన్, మిర్జా జుబేర్ బేగ్తో పాటు మరో ఇద్దరు నిందితులు అముల్ చౌరే, షేక్ షేర్ఖాన్లను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఏడుగురు నిందితులను కేసులో అరెస్ట్ చేశారు. కంజర్లో దొరికిన ముగ్గురు నిందితుల వద్ద సుమారు 1.2 కిలోల గంజాయి, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నాందేడ్లో అదుపులోకి తీసుకున్న నిందితుల వద్ద నుంచి 900 గ్రాముల గంజాయి, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన సీఐ సురేశ్కుమార్, ఎస్సై సుష్మిత, సిబ్బందిని సీపీ సాయి చైతన్య అభినందించారు.
