అక్షరటుడే, వెబ్డెస్క్: Konaseema district | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ (Konaseema District) జిల్లాలోని అంతర్వేది సముద్ర తీరంలో ఓ ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. సాధారణంగా సముద్ర అలలు కొన్ని మీటర్లు ముందుకు వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి.
అయితే, ఆదివారం అకస్మాత్తుగా సముద్రం (Sea) దాదాపు 500 మీటర్ల మేర వెనక్కి వెళ్లిపోవడంతో తీరమంతా మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో నిండిపోయింది. ఈ దృశ్యం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఎప్పుడూ అలలతో ఎగసిపడే అంతర్వేది తీరంలో (Antarvedi coast) నీళ్లు ఒక్కసారిగా వెనక్కి వెళ్లపోవడంతో పర్యాటకులు, భక్తులు సముద్ర స్నానానికి వెళ్లడానికే భయపడుతున్నారు.
Konaseema district | ఆందోళనలో స్థానికులు..
శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు సాధారణంగా ఈ బీచ్లో (Antharvedi Beach) స్నానం చేసి ఆలయానికి వెళ్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా వారిలో కూడా భయం నెలకొంది. స్థానికులు సునామీ భయంతో ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే, సునామీకి ముందు సాధారణంగా సముద్ర జలాలు వెనక్కి వెళ్లిపోవడం జరుగుతుందని నిపుణులు చెబుతారు. భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనాలు లేదా సముద్రంలో కొండచరియలు విరిగిపడినప్పుడు (landslides) ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయి. ఆ తర్వాత రాకాసి అలలు వేగంగా ఒడ్డుకు చేరే అవకాశం ఉంటుంది.
అయితే, నిపుణులు మరో కారణాన్ని కూడా వివరిస్తున్నారు. సముద్రంలో రోజులో రెండుసార్లు నీటి మట్టం పెరగడం (పోటు), రెండుసార్లు తగ్గడం (పాటు) సహజమని, ఇది సూర్యుడు, చంద్రుని గురుత్వాకర్షణ వల్ల జరిగే ప్రక్రియ అని చెబుతున్నారు. సాధారణంగా ఈ చక్రం ప్రతి 6 గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం గోదావరి (Godavari) నదిలో ఉధృత ప్రవాహం కొనసాగుతుండగా, అంతర్వేది వద్ద సముద్రం వెనక్కి తగ్గడం స్థానికుల్లో అనుమానాలు, భయాలు రేకెత్తిస్తోంది.