Homeతెలంగాణwoman bus driver | TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవరుగా సరిత

woman bus driver | TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవరుగా సరిత

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: woman bus driver మహిళామణులు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. అత్యున్నత ప్రతిభతో ప్రతిచోట తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని తామేంటో నిరూపిస్తున్నారు.

తాజాగా డ్రైవింగ్​ రంగంలోనూ రాణిస్తున్నారు. ఇప్పటివరకు క్యాబ్​ డ్రైవర్లు(cab drivers)గా, ఆటో డ్రైవర్లు(auto drivers)గా మహిళలు తారసపడ్డారు. ఇకపై ఆర్టీసీలోనూ వెలుగు వెలగబోతున్నారు. తాజాగా సరిత అనే మహిళ ఆర్టీసీ ప్రగతి చక్రం స్టీరింగ్​ను పట్టింది. విజయవంతంగా బస్సు నడిపింది.

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యా తండాకు చెందిన వాంకుడోతు రాంకోటి, రుక్కా దంపతుల కూతురు సరిత. ఈ దంపతులకు అయిదుగురు ఆడపిల్లలు. నలుగురు ఆడపిల్లల వివాహాలు చేయడానికి తమకున్న మూడు ఎకరాల భూమిని అమ్మేశారు.

దీంతో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు సరిత తొలుత ఆటో డ్రైవరుగా మారారు. ఆకతాయిల వేధింపులు, అల్లరి ఎక్కువ కావడంతో తన ఆహార్యాన్ని మార్చేసుకున్నారు. జుట్టు కత్తిరించుకుని ప్యాంటు, షర్టు ధరించి మగరాయుడిలా తయారయ్యేవారు. అయిదేళ్లపాటు సంస్థాన్‌ నారాయణపురం నుంచి సీత్యాతండా వరకు ఆటో నడిపారు.

ప్రైవేటుగా పదో తరగతి చదివి పాసైన సరిత, హెవీ మోటారు డ్రైవింగు లైసెన్సు పొందారు. తదుపరి హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో ఉంటూ బస్సు డ్రైవింగు నేర్చుకున్నారు. ఆజాద్‌ ఫౌండేషన్‌ సాయంతో సరిత ఢిల్లీకి వెళ్లి కొన్నాళ్లు కారు నడిపారు.

2015లో ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ Delhi Transport Corporation – DTC)లో బస్సు డ్రైవరుగా సరిత ఎంపిక అయ్యారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టులో సరిత ఒక్కరే మహిళా డ్రైవరు కావడం విశేషం. భారత్​లోనే అత్యధిక వాహనాల రద్దీ కలిగిన దేశ రాజధాని ఢిల్లీలో 185 కిలోమీటర్ల దూరం బస్సు నడిపారు.

మొట్టమొదటి మహిళా బస్సు డ్రైవరుగా చరిత్ర సృష్టించిన సరిత, 2018లో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారం అందుకున్నారు. అంతకు ముందు 2017లో తెలంగాణ ప్రభుత్వం తరఫున కుమ్రం భీం అవార్డును సొంతం చేసుకున్నారు. తదుపరి దేశంలోని ప్రముఖ సంస్థలు, వ్యక్తుల నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులు, సత్కారాలు అందుకున్నారు.

ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో పనిచేస్తే సరితకు వచ్చే రూ.18 వేల నెలసరి వేతనం సరిపోలేని పరిస్థితి. మరోవైపు తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకోవడంతో తిరిగి తన తండాకు చేరుకున్నారు. స్థానికంగా ఉపాధి కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఈ క్రమంలో ప్రజాదర్బార్‌(Praja Darbar)లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Delhi Transport Corporation)ని సరిత కలిశారు. తెలంగాణ ఆర్టీసీలో ఉపాధి కల్పించాలని మంత్రిని వేడుకున్నారు. స్పందించిన మంత్రి.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Transport Minister Ponnam Prabhakar), ఆర్టీసీ ఎండీ సజ్జనార్(RTC MD Sajjanar) కు వీడియో కాల్ చేసి దేశంలోనే తొలి మహిళా బస్సు డ్రైవరు సరిత గురించి వివరించారు. ఆమెకు ఉపాధి కల్పించాలని కోరారు.

అలా మంత్రి కోమటిరెడ్డి సిఫారసు మేరకు టీజీఎస్ ఆర్‌టీసీలో సరితకు ఉద్యోగం వరించింది. అధికారులు ఆమెకు హైదరాబాద్ డిపోలో విధులు కేటాయించారు. ఎంజీబీఎస్‌ నుంచి మిర్యాలగూడ వరకు నాన్‌స్టాప్‌ బస్సు నడిపి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవరుగా చేరి.. తొలి మహిళా బస్సు డ్రైవరుగా సరిత రికార్డు సొంతం చేసుకున్నారు.