అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలో ఉదయం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. గంటన్నర పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి (Rain) పట్టణంలోని కాలనీలన్నీ ఆగమయ్యాయి. భారీవర్షానికి (Heavy Rain) జిల్లా కేంద్రంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.
ప్రధాన రోడ్లన్నీ జలమయంకావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బతుకమ్మ కుంట, అయ్యప్ప నగర్, వాసవి నగర కాలనీల్లోని లోతట్టు ప్రాంతంలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా (Nizamsagar Chowrastha) నుంచి ఎల్లారెడ్డి (Yellareddy) వైపు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా జలమయమైంది. విద్యానగర్ కాలని, ఎన్జీవోస్ కాలనీ, అశోక్ నగర్ కాలనీల్లో భారీగా వర్షపు నీరు చేరుకుంది.
స్టేషన్ రోడ్డు, సిరిసిల్లా రోడ్, జేపీఎన్ రోడ్, సుభాష్ రోడ్లపై నుండి వర్షపు నీరు ప్రవహించింది. లోతట్టు ప్రాంతాల బాధితులు మాట్లాడుతూ.. రెండు గంటలుగా కురిసిన భారీ వర్షానికి ఇళ్లలోకి నీరు చేరడంతో పప్పు దినుసులు, బియ్యం, ఇతర వస్తువులు తడిసి ముద్దయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లనే ఇళ్లల్లోకి నీరు వస్తుందని ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner)కు ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని వెంటనే డ్రెయినేజీ వ్యవస్థను నిర్మించాలంటూ డిమాండ్ చేశారు.