అక్షరటుడే, ఇంటర్నెట్ డెస్క్: PM Modi | కాంగ్రెస్ పార్టీని ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) విమర్శించారు. కాంగ్రెస్ ప్రతికూల రాజకీయాలను దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారని వ్యాఖ్యానించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాం (Assam) రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా కలియాబోర్ ప్రాంతంలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల్లో మద్దతు పెరుగుతోందన్నారు. ప్రజల మొదటి ఎంపికగా తమ పార్టీ మారిందని పేర్కొన్నారు. ఓటర్లు సుపరిపాలన, అభివృద్ధిని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికలతో పాటు తిరువనంతపురం, ముంబయి (Thiruvananthapuram and Mumbai) స్థానిక ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైందని చెప్పారు.
PM Modi | కాంగ్రెస్కు అభివృద్ధి అజెండా లేదు
కాంగ్రెస్ ఈ దేశాన్ని ఎన్నో ఏళ్లు పాలించిందని.. అయినా కూడా ఆ పార్టీకి అభివృద్ధి అజెండా లేదని ప్రధాని విమర్శించారు. అందువల్లే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. భారత వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తులతో ఆ పార్టీ జట్టు కట్టిందంటూ విమర్శలు చేశారు.
PM Modi | కాంగ్రెస్ అస్సాంలో వారికి ఆశ్రయం
కాంగ్రెస్ అస్సాంలో చొరబాటుదారులకు ఏళ్లుగా ఆశ్రయం ఇచ్చిందని మోదీ ఆరోపించారు. వారి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ ప్రయత్నం అని అన్నారు. ఆ పార్టీ ప్రభుత్వ హయాంలో చొరబాటుదారులు రాష్ట్రంలోకి వచ్చారన్నారు. అక్రమ వలసదారులు ప్రజల భూములు ఆక్రమించుకుంటూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో అస్సాం ప్రజల అస్తిత్వం ప్రమాదంలో పడిందన్నారు. ప్రస్తుత బీజేపీ సర్కారు ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.