అక్షరటుడే, ఇందూరు : Local Body Elections | నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు.
నిజామాబాద్ (Nizamabad) రెవెన్యూ డివిజన్ పరిధిలోని మోపాల్ మండలం కులాస్పూర్, జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామ పంచాయతీలను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని అన్నారు.
రెండోవిడత నామినేషన్ల (Nominations) ప్రక్రియ ఆదివారం ప్రారంభమైందని, మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తారని తెలిపారు. చివరిరోజు ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున.. అందుకు తగినవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. చివరి సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని, కావున అభ్యర్థులు ముందు జాగ్రత్త వహించాలన్నారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్డెస్క్ను సంప్రదించాలని సూచించారు. ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలిపారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.
