అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad | కారులో తరలిస్తున్న నోట్ల కట్టలను పోలీసులు పట్టుకున్నారు. కారు డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో కనిపించకుండా రూ.4 కోట్ల డబ్బును తరలిస్తుండగా.. పోలీసులు వారిని ఛేజ్ (police chase) చేసి పట్టుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్లు మీడియాకు వెల్లడించారు.
నిందితులు ప్రకాష్ ప్రజాపతి (30), ప్రజ్ఞేష్ కీర్తిభాయ్ ప్రజాపతి (28) గతేడాది కొంతమందిని మోసం చేశారు. రూ.50 లక్షల నగదు ఇస్తే అదనంగా రూ.10 లక్షలు కలిపి ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తామని నమ్మించారు. దీంతో వారు డబ్బులు ఇవ్వగా.. తర్వాత ఎలాంటి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయలేదు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపై గత ఏడాది బోయిన్ పల్లి పీఎస్(Boynpally PS)లో చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇటీవల నిందితులను గుర్తించారు. వారు హైదరాబాద్కు వస్తున్నట్లు తెలియడంతో పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితేని నిందితులు పోలీసులకు చిక్కకుండా పారిపోయారు.
Hyderabad | మహబూబ్నగర్లో..
నిందితులు క్రెటా కారులో పారిపోతుండగా.. హైదరాబాద్ పోలీసులు వారిని వెంబడించారు. శామీర్ పేట్ ORR నుంచి మహబూబ్ నగర్ (Mahbubnagar) వారిని ఛేజ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అడక్కల్ పోలీసుల సాయంతో నిందితులను పట్టుకున్నారు. అనంతరం కారులో తనిఖీలు చేయగా.. రూ.4.05 కోట్ల డబ్బు దొరికినట్లు డీసీపీ తెలిపారు. ఆ డబ్బును సీజ్ చేశారు. అయితే ఆ నగదు ఎవరిది, ఎక్కడికి తరలిస్తున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది.
