అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR | కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారించిన పీసీ ఘోష్ కమిషన్.. కాంగ్రెస్ పార్టీ వేసుకున్న పీసీసీ ఘోష్ కమిషన్ (PCC Ghosh Commission) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. శనివారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో గన్పార్కు అమరుల స్థూపం వద్ద యూరియా కొరతపై ఖాళీ బస్తాలతో వినూత్నంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కొరత (Urea Shortage) తీవ్రంగా ఉందన్నారు. రైతులు పనులు మానుకుని రాత్రీపగలూ సొసైటీల వద్ద బారులు తీరుతున్నారని అయినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. గత పదేళ్ల పాలనలో ఏరోజు కూడా రైతులకు ఇబ్బందులు రాలేదని, కాంగ్రెస్ వచ్చాకే అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లే యూరియా కొరత ఏర్పడిందని ఆరోపించారు.
KTR | అన్నింటిపైనా చర్చకు సిద్ధం
ఏ అంశంపైన అయినా అసెంబ్లీలో చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధమని కేటీఆర్ (KTR) అన్నారు. అది కాళేశ్వరమైనా, యూరియా కొరత అయినా, బీసీ రిజర్వేషన్లు అయినా, ప్రజా సమస్యలపైనా చర్చకు ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం గురించి కూడా సమాధానం చెబుతామన్నారు.
వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని ఏ అంశం పైననైనా సభలో చర్చకు పెడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వ్యవసాయ విస్తీర్ణంతో పాటు వ్యవసాయ సంక్షేమానికి కేసీఆర్ చేసిన కార్యక్రమాలు, పథకాల గురించి వివరిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం (State Government) తూతూ మంత్రంగా నాలుగు రోజులు కాదు.. కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, అంతకు మించి నిర్వహించినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా, అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని తెలిపారు. అర్ధవంతమైన చర్చకు బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందన్నారు.
KTR | రైతుల సమస్యలపై కొట్లాడదాం..
రాష్ట్రంలో రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వం శాసనసభను తమకు అనుకూలంగా ఉండేలా నడిపించే ప్రయత్నం చేస్తోందన్నారు. రైతుల సమస్యల పైన, రాష్ట్రంలో ఉన్న ఎరువుల సంక్షోభం పైన మాట్లాడటం లేదన్నారు. రైతుల విషయంలో ప్రభుత్వాన్ని సభలో, బయటా నిలదీస్తామని చెప్పారు.
10 సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఎరువుల కొరత రాలేదని, రైతులు లైన్లలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి తేలేదని గుర్తు చేశారు. మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెప్పులను లైన్లో పెట్టడం, ఆధార్ కార్డులను లైన్లో పెట్టే పరిస్థితి వచ్చింది? పండుగ రోజు కూడా రైతులు ఎరువుల కోసం లైన్లలో నిలబడి, వర్షంలో తడిసి ఇబ్బందులు పడే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 600కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, 75 లక్షల మంది రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు.
పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, భారీ వర్షాల వల్ల ఇబ్బందుల గురించి గానీ అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరపాలని, వ్యవసాయ సంక్షోభం పైన చర్చ పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీల నుంచి 420 హామీల అమలు వైఫల్యాల దాకా, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపైనా అన్నింటిపైనా చర్చ జరపాలని కేటీఆర్ అన్నారు.
KTR | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై..
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదని కేటీఆర్ పేర్కొన్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దామన్నారు. ఇప్పటికే అసమ్మతి ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ ప్రక్రియ కొనసాగుతోందని ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దామని తెలిపారు.