అక్షరటుడే, వెబ్డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ఇటీవల మంత్రివర్గం (Cabinet) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్ రెండో వారంలోపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు.
మంత్రి సీతక్క గురువారం కామారెడ్డి (Kamareddy) జిల్లాలో పర్యటించారు. భిక్కనూరు మండలంలోని బస్వాపూర్లో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో తీసుకున్న నిర్ణయం మేరకు బీసీలకు 27 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. అయితే కాంగ్రెస్ (Congress) పార్టీ తరఫున మాత్రం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు అనంతరం నిర్వహిస్తామన్నారు.
Local Body Elections | మళ్లీ మొదలైన సందడి
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. గతంలో నోటిఫికేషన్ విడుదలయ్యాక బీసీ రిజర్వేషన్ల (BC Reservations) జీవోను కోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే. దీంతో పోటీకి ప్రయత్నించిన ఆశావహులు నిరాశ చెందారు. తాజాగా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతుండటంతో పలువురు పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనే ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ప్రకటించింది. అయితే అందులో బీసీలకు 42శాతం అమలు చేశారు. దీంతో మరోసారి రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటరు జాబితాను ప్రచురించాలని ఆదేశించింది. తర్వలోనే పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించనుంది. అనంతరం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
ప్రజా పాలన వారోత్సవాలు డిసెంబర్ తొలివారంలో జరగనున్నాయి. అనంతరం ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఎన్నిలకు సకాలంలో పెట్టకపోతే మార్చిలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులు రావని మంత్రి సీతక్క తెలిపారు. అందుకే ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
