అక్షరటుడే, వెబ్డెస్క్: Pak Defense Minister | పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారతదేశంపై విషం కక్కారు. అదే సమయంలో పొరుగు దేశంతో మరో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
పాకిస్తాన్ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఖవాజా (Pak Defense Minister Khawaja Asif) భారత్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో గతంలో జరిగిన నాలుగు యుద్ధాల్లో ఓటమి చెందినప్పటికీ, భవిష్యత్తులో జరిగే పోరాటంలో మాత్రం మెరుగైన ఫలితం సాధిస్తామని చెప్పారు. తద్వారా మరో యుద్ధం తప్పదన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు.
Pak Defense Minister | అల్లా పేరిట పాక్ ఏర్పాటు..
భారతదేశం (India) ఎప్పుడూ ఐక్య దేశంగా లేదని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ “అల్లాహ్ పేరు మీద” ఏర్పడినప్పటికీ, గత చరిత్ర చూస్తే భారతదేశం ఎప్పుడూ ఐక్య దేశంగా లేదని పేర్కొన్నారు. “భారతదేశం ఎప్పుడూ ఒకే ఐక్య దేశంగా లేదని చరిత్ర చెబుతుంది. కొంతకాలం ఔరంగజేబ్ పాలనలో తప్ప ఎప్పుడూ ఐక్యంగా లేదు. చాలా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ పాకిస్తాన్ (Pakistan) మాత్రం అల్లా పేరు మీద సృష్టించబడింది. స్వదేశంలో మనంలో మనం వాదనలు చేసుకుంటాం. పోటీ పడతాం. కానీ ఇండియాతో పోరాట సమయంలో మాత్రం మనమంతా కలిసే ఉంటాం” అని ఆసిఫ్ పేర్కొన్నారు.
Pak Defense Minister | మెరుగైన ఫలితాలు సాధిస్తాం..
దేశమంతా కలిసి ఉన్నప్పటికీ పాకిస్తాన్ భారతదేశంతో చేసిన ప్రతి యుద్ధంలోనూ ఓడిపోయిందని ఖవాజా ఆసిఫ్ గుర్తు చేశారు. భారతదేశంతో పాకిస్తాన్ ఎలాంటి ఉద్రిక్తతను కోరుకోవడం లేదని, కానీ “ప్రమాదాలు నిజమైనవి. నేను వాటిని తిరస్కరించడం లేదు” అని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి పేర్కొన్నారు. “యుద్ధం విషయానికి వస్తే, దేవుడు ఇష్టపడితే, ఇన్షా అల్లాహ్.. గతం కంటే మెరుగైన ఫలితాన్ని మనం సాధిస్తాం” అని ఖవాజా ఆసిఫ్ సమా టీవీకి చెప్పారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ (Army Chief Asim Munir) గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రతిబింబించేలా ఆసిఫ్ తాజా వ్యాఖ్యలలోని మతపరమైన అంశాలను లేవనెత్తారు. భారతదేశంపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి మునీర్ మత పరమైన వ్యాఖ్యలను ఉపయోగించారు. “మా మతాలు వేరు, ఆచారాలు వేరు, సంప్రదాయాలు వేరు, మా ఆలోచనలు వేరు, మా ఆశయాలు వేరు” అని మునీర్ వ్యాఖ్యానించారు.