అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : PCC Chief | ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం మనదేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ (MLC Mahesh Kumar Goud) అన్నారు. భారత రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా నిజామాబాద్ (Nizamabad) నగరంలోని బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ వజ్రోత్సవాల వేల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ (Baba Saheb Ambedkar)ను స్మరించుకున్నామన్నారు. భారత రాజ్యాంగం ఇతర దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో కొన్ని అరాచక శక్తులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. అంతేకాకుండా దేశ చరిత్రను తిరగరాసే కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. విద్యావంతులు, మేధావులు అరాచక శక్తుల కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన వెంట వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నాయకులు ఉన్నారు.
