అక్షరటుడే, వెబ్డెస్క్ : Maharashtra CM | త్వరలోనే నక్సలిజం అంతమవుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. తెలంగాణ(Telanagana), చత్తీస్గఢ్ లోని రెడ్ కారిడర్ మొత్తం నక్సలిజం నుంచి విముక్తి పొందుతుందన్నారు.
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్రావు (Mallojula Venugopal Rao) అలియస్ భూపతితో పాటు మరో 60 మంది మావోలు లొంగిపోవడం మహారాష్ట్రలో నక్సలైట్ ఉద్యమం ముగింపునకు ప్రారంభమని తెలిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి నిషేధించబడిన మావోయిస్టులకు వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహిస్తున్నందుకు తాను గర్విస్తున్నానన్నారు. బుధవారం మావో అగ్ర నేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ భూపతి సహా 60 మంది లొంగిపోయిన సందర్భంగా గడ్చిరోలి జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
Maharashtra CM | మిగతా వారూ అజ్ఞాతం వీడాలి
ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల తర్వాత కొద్దిమంది మాత్రమే నక్సలైట్లు మిగిలి ఉన్నారని సీఎం అన్నారు. వారు కూడా లొంగిపోవాలని పిలుపునిచ్చారు. లేకపోతే పోలీసుల చేతుల్లో పరాభవం తప్పదన్నారు. దేశంలో నక్సలిజంపై పోరాటానికి గడ్చిరోలి (Gadchiroli)నాయకత్వం వహిస్తుందన్నారు. గడ్చిరోలిలోని అహేరి. సిరోంచాలో నక్సల్ ఉద్యమాన్ని పెంచిన భూపతి, 60 మంది ఇతర కార్యకర్తలు లొంగిపోవడం ఒక పెద్ద పరిణామం అని ఫడ్నవీస్ పేర్కొన్నారు. “దేశ చరిత్రలో ఇది ఒక పెద్ద విషయం. భూపతి లొంగిపోవడం మహారాష్ట్రలో నక్సల్ ఉద్యమం ముగింపుకు నాంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
Maharashtra CM | సైద్ధాంతికంగా ఓడిపోయారు..
నక్సలైట్లు తాము సైద్ధాంతిక యుద్ధంలో ఓడిపోయామని తెలుసుకోవాలని ఫడ్నవిస్ (Maharashtra CM Fadnavis)తెలిపారు. జన జీవన స్రవంతిలో చేరడం, భారత రాజ్యాంగాన్ని పాటించడం ద్వారా మాత్రమే సమానత్వం, న్యాయం సాధించవచ్చన్నారు. మల్లోజుల సహా 60 మంది కార్యకర్తల లొంగుబాటు మావోయిస్టుల రెడ్ కారిడార్ ముగింపునకు మార్గం సుగమం చేస్తుందని, ఇది మహారాష్ట్ర నుంచి ప్రారంభమైనందున ఇది గర్వించదగ్గ క్షణం అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం మాత్రమే తమకు న్యాయం చేయగలదని వారు అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు.సైద్ధాంతిక యుద్ధంలో ఓడిపోయామని ఛత్తీస్గఢ్లో ఉన్న మిగిలిన కార్యకర్తలు కూడా గుర్తించాలని, వారు కంటున్న కలలు తప్పు అని అర్థం చేసుకుకోవాలన్నారు.
Maharashtra CM | లొంగిపోయిన వారికి పునరావాసం
రాబోయే రోజుల్లో ఛత్తీస్గఢ్ (Chhattisgarh), తెలంగాణలో కూడా 100 మందికి పైగా కార్యకర్తలు లొంగిపోతారని, “రెడ్ కారిడార్” అని పిలవబడే నక్సలిజం అంతమవుతుందని తాను నమ్ముతున్నానని ఫడ్నవీస్ విశ్వాసం వ్యక్తం చేశారు. లొంగిపోయిన వారికి గౌరవంగా పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాబోయే ఐదు నుంచి ఏడు సంవత్సరాలలో గడ్చిరోలిలోని ఒక లక్ష మంది “మట్టి పుత్రులకు” జిల్లాలోనే ఉపాధి లభిస్తుందని, ఇది ఉక్కు కేంద్రంగా మారుతోందన్నారు. గత 10 సంవత్సరాలలో, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం (Narendra Modi Government)పరిపాలన సమాజంలోని చివరి వ్యక్తికి అభివృద్ధి చేరేలా చూసిందన్నారు. నక్సలైట్లకు లొంగిపోయి ప్రధాన స్రవంతిలోకి చేరడం లేదా పరిణామాలను ఎదుర్కోవడం అనే రెండు ఎంపికలను మాత్రమే ఇచ్చిందన్నారు.
Maharashtra CM | ఉగ్రు వ్యాపార కేంద్రంగా గడ్చిరోలి..
“రాబోయే రెండు సంవత్సరాలు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే అలాంటి ఉద్యమం ముగింపు దశకు చేరుకున్నప్పుడు, మిగిలిన కొద్దిమంది చివరిసారిగా దాడి చేయడానికి ప్రయత్నిస్తారు” అని ఫడ్నవీస్ పోలీసులను హెచ్చరించారు. 40 సంవత్సరాలకు పైగా గడ్చిరోలి జిల్లా మావోయిస్టు హింసను చూసిందని, అభివృద్ధికి దూరంగా ఉందని పేర్కొన్నారు. గడ్చిరోలి యువత మావోయిస్టు భావజాలంతో తప్పుదారి పట్టారని, రాజ్యాంగం ద్వారా మాత్రమే సమానత్వం సాధించబడుతుందని వారికి తెలియదన్నారు. నేడు, గడ్చిరోలి దేశంలో ఉక్కు వ్యాపార కేంద్రంగా మారుతోందని, దాదాపు రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు భారీ ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు .గడ్చిరోలికి రావాలని, 95 శాతం ఉద్యోగాలకు స్థానికులనే పరిగణించాలని పెట్టుబడిదారులను కోరినట్లు ఫడ్నవీస్ చెప్పారు. రాబోయే 5 నుండి 6 సంవత్సరాలలో గడ్చిరోలి, దాని ప్రక్కనే ఉన్న చంద్రపూర్లలో స్థానికులకు లక్షకు పైగా మంచి ఉపాధి అవకాశాలను కల్పించాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన అన్నారు.