అక్షరటుడే, వెబ్డెస్క్ : Pakistan | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో చావు దెబ్బ తిన్నా.. పాకిస్థాన్, ఆ దేశంలోని ఉగ్రవాదులకు ఇంకా బుద్ది రావడం లేదు. లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి కవ్వింపులకు పాల్పడ్డాడు.
పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) సూత్రదారి అయిన సైఫుల్లా పాక్లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏకంగా ప్రధాని మోదీ (PM Modi)ని బెదిరించడం గమనార్హం. మరోసారి పహల్గామ్లాంటి దాడి చేస్తామని అన్నాడు. కసూరి మాట్లాడుతూ.. భారత్ నీటి ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపించాడు. ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేసి పాక్లో వరదలు రావడానికి కారణం అవుతోందన్నాడు. ‘‘మే 10న మనం చేసినట్లుగా మోదీకి పాఠం నేర్పించండి”అని ఆ దేశ ఆర్మీ చీఫ్ను కోరాడు.
Pakistan | ప్రతీకారం తీర్చుకుంటాం
కసూరి వ్యాఖ్యలు పాక్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వరద సహాయక చర్యల పేరుతో ఆయన పర్యటిస్తూ.. భారత్పై విష ప్రచారం చేస్తున్నాడు. ఇటీవల వరదలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశాడు. పాకిస్థాన్లో భారత వ్యతిరేక భావాలను రెచ్చగొట్టడానికి, ఉగ్రవాద చొరబాటులను ప్రోత్సహించడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.
Pakistan | చావు దెబ్బ తిన్నా..
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏప్రిల్ 22న పహల్గామ్లో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో 26 మంది పర్యాటకులు చనిపోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి భారత్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అనంతరం పాక్ దాడికి దిగితే ధీటుగా బదులిచ్చింది. పాక్ యుద్ధ విమానాలను కూల్చడంతో పాటు ఆ దేశంలోని ఎయిర్ బేస్లను సైతం భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. యుద్ధంలో చావు దెబ్బ తిన్నా పాకిస్థాన్ బయటకు మాత్రం తామే గెలిచామని చెప్పుకుంటోంది. భారత యుద్ధ విమానాలను కూల్చినట్లు ప్రచారం చేసుకుంటుంది. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు బలోచిస్తాన్ వేర్పాటువాదుల దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాక్ భారత్పై విష ప్రచారం మాత్రం మానడం లేదు. సొంత దేశాన్ని చక్కదిద్దుకోవాల్సింది పోయి ఉగ్రవాదులను భారత్పైకి ఉసిగొల్పుతోంది.
