అక్షరటుడే, హైదరాబాద్: Konda Surekha | తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ నివాసంలో బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఓఎస్డీ OSD సుమంత్ను అరెస్టు చేయడానికి వచ్చిన వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులను మంత్రి కుమార్తె కొండా సుస్మిత గేటు వద్దే అడ్డుకున్నారు.
హైదరాబాద్లో మంత్రి కొండా సురేఖ Konda Surekha నివాసం వద్ద బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ ఎన్. సుమంత్పై చర్యల నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం Telangana government ఇటీవల సుమంత్ను విధుల నుంచి తొలగించింది.
కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) Pollution Control Board (PCB) లో ఓఎస్డీగా పనిచేస్తున్న సుమంత్.. అధికారులపై ఒత్తిడి తేవడం, అవినీతి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ముఖ్యంగా డెక్కన్ సిమెంట్ కంపెనీకి సంబంధించిన ఫైల్ వ్యవహారంలో తుపాకీతో బెదిరించారన్న ఆరోపణలు తీవ్రతరం కావడంతో సీఎం ఆదేశాల మేరకు సుమంత్పై వేటు పడింది.
అయితే, తొలగింపు తర్వాత కూడా సుమంత్ మంత్రి సురేఖ ఇంట్లోనే ఉన్నారని సమాచారం అందడంతో, మఫ్టీ దుస్తుల్లో నలుగురు టాస్క్ఫోర్స్ పోలీసులు జూబ్లీహిల్స్లోని ఆమె నివాసానికి చేరుకున్నారు.
Konda Surekha | టెన్షన్ వాతావరణం..
వారు సుమంత్ను Sumanth అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా, మంత్రి కుమార్తె కొండా సుస్మిత వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. పోలీసులను నిలదీసిన సుస్మిత, వారెంట్ లేకుండా ఇంట్లోకి ప్రవేశించరాదని స్పష్టం చేశారు.
“ఏ ప్రభుత్వంలో ఉన్నామో అర్థం కావడం లేదు” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై మీడియా సమాచారం పొందడంతో అక్కడకు చేరుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్రెడ్డి, మాజీ మంత్రి కడియం శ్రీహరి తమ కుటుంబంపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు. బీసీ మంత్రిగా ఉన్న తన తల్లిని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.
అలాగే, మాజీ నక్సలైట్ అయిన తన తండ్రి కొండా మురళికి Konda Murali కేటాయించిన గన్మెన్లను తొలగించారని, అదే సమయంలో సీఎంఆర్ సోదరులకు భద్రత ఇచ్చారని ప్రశ్నించారు.
ఈ వ్యవహారం వెనుక కుట్ర ఉందని, సుమంత్ను అదుపులోకి తీసుకుని తమ తండ్రి పేరును బలవంతంగా ప్రస్తావింపజేసి కేసుల్లో ఇరికించాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య మంత్రి సురేఖ తన కారులో సుమంత్ను ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనతో తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేగింది.