అక్షరటుడే, వెబ్డెస్క్ : Cabinet Meeting | తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం జరిగింది.
మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా మూడు వ్యవసాయ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. జయశంకర్ వర్సిటీకి అనుబంధంగా ఈ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే శ్రీశైలం ఎలివేటేడ్ కారిడార్ (Srisailam Elevated Corridor)కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరించాలని నిర్ణయించింది.
Cabinet Meeting | బీసీ రిజర్వేషన్లపై..
బీసీ రిజర్వేషన్ల (BC Reservations)పై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గంలో కీలక చర్చ జరిగింది. తదుపరి కార్యాచరణపై మంత్రివర్గం దృష్టి పెట్టింది. కేసు వాదించిన సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనల మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
Cabinet Meeting | ప్రజాపాలన విజయోత్సవాలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అవుతున్న తరుణంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే ఆర్అండ్బీ హ్యామ్ రోడ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.10, 500 కోట్లతో నిర్మించే 5,500 కి.మీ హ్యామ్ రోడ్లకు ఆమోదం తెలిపింది. వీటికి త్వరలో టెండర్లు పిలవాలని నిర్ణయించింది.