అక్షరటుడే, వెబ్డెస్క్ : FASTag | దేశవ్యాప్తంగా టోల్ చెల్లింపుల విధానంలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.
టోల్గేట్ల (Toll Gates) వద్ద వాహనాలు నిలిచిపోవడం, క్యూలైన్లలో సుదీర్ఘ కాలం వేచి చూడటం వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమైందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Minister Nitin Gadkari) శుక్రవారం ప్రకటించారు. ఈ ఏడాది చివరికల్లా దేశంలో కొత్త ఎలక్ట్రానిక్ టోల్ పేమెంట్ సిస్టమ్ను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఫాస్టాగ్ వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ స్కానింగ్ వరకు వాహనాలు ఆగాల్సిన పరిస్థితి ఉంది.
FASTag | కొత్త టెక్నాలజీ ప్రత్యేకతలు ఏమిటి?
సెలవుదినాలు, రద్దీ సమయాల్లో టోల్గేట్ల వద్ద భారీగా క్యూ లైన్లు ఏర్పడటం సాధారణంగా మారింది. అయితే రాబోయే కొత్త టెక్నాలజీ ప్రవేశంతో ఈ సమస్యలన్నీ చరిత్ర కావనున్నాయని గడ్కరీ స్పష్టం చేశారు. టోల్గేట్ వద్ద వాహనం ఆపాల్సిన అవసరం లేకుండానే టోల్ ఫీజు ఆటోమేటిక్గా కట్ అవుతుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ సిస్టమ్ (Electronic Toll Payment System) పూర్తిగా ఎఐ ఆధారిత ఆధునిక టెక్నాలజీపై రూపొందించారు.వాహనం దూసుకెళ్లే సమయంలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) ద్వారా ఫాస్టాగ్ నుంచి చెల్లింపు పూర్తవుతుంది. దేశవ్యాప్తంగా అమలు చేసే ముందు మొదటగా 10 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్గా ఈ వ్యవస్థను పరీక్షించనున్నారు. విజయవంతంగా నడిస్తే మొత్తం దేశంలో ఈ విధానాన్ని అమలు చేస్తారని గడ్కరీ తెలిపారు.
ఇప్పటికే హైదరాబాద్ (Hyderabad) ఓఆర్ఆర్లో కొన్ని ప్రదేశాల్లో ఇలాంటి టెక్నాలజీ ప్రయోగాత్మకంగా అమలవుతున్నట్లు సమాచారం. దీని వలన వాహనదారులకు లాభం, టోల్గేట్ల వద్ద నిలిచి ఉండే అవసరం లేకపోవడంతో సమయం ఆదా, ట్రాఫిక్ జాం సమస్య తగ్గింపు, ఇంధన పొదుపు, మరింత వేగవంతమైన ప్రయాణం చేయవచ్చు. కేంద్రం తీసుకురాబోతున్న ఈ నూతన ఎలక్ట్రానిక్ టోల్ సిస్టమ్ రోడ్డు ప్రయాణాల్లో పెద్ద మార్పుకు దారితీయనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
